Mohan Yadav: మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిని ప్రకటించిన బీజేపీ

  • ఇటీవలి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ
  • సీఎంల ఎంపిక కోసం కసరత్తులు
  • మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ పేరును ప్రకటించిన బీజేపీ హైకమాండ్
BJP announces Madhya Pradesh new chief minister

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ... రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను మట్టికరిపించింది. తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో  ఏమంత ప్రభావం చూపలేకపోయింది. 

కాగా, తాము గెలిచిన మూడు రాష్ట్రాల్లో  సీఎంలను ఎంపిక చేసేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ పేరును ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా జగదీశ్ దేవ్ డా వ్యవహరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించింది. 

58 ఏళ్ల మోహన్ యాదవ్ ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జయిని (సౌత్) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానాన్ని మోహన్ యాదవ్ భర్తీ చేయనున్నారు. 

మధ్యప్రదేశ్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు ఉన్న మోహన్ యాదవ్ 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన, 2018 ఎన్నికల్లోనూ నెగ్గారు. 2020లో అప్పటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్ లో మంత్రి పదవిని కూడా చేపట్టారు.

More Telugu News