Cong MP: నల్లధనంపై అప్పట్లో ట్వీట్ చేసిన ఎంపీ ఇంట్లోనే నేడు గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎంపీ పాత ట్వీట్ వైరల్

  • కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుపై మండిపడుతున్న నెటిజన్లు
  • నోట్ల రద్దు తర్వాత కూడా నల్లధనం దొరకడంపై ధీరజ్ ఆశ్చర్యం
  • ప్రస్తుతం ఆయన ఇంట్లో రూ.350 కోట్ల విలువైన నోట్ల కట్టలు సీజ్
  • ఇంకా కొనసాగుతున్న నోట్ల కట్టల లెక్కింపు
Cong MP Dhiraj Sahus Old Tweet Goes Viral

పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా భారీ మొత్తంలో నల్లధనం బయటపడడంపై ఓ ఎంపీ అప్పట్లో ఆశ్చర్యపోయారు.. అంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఎలా పోగేస్తారో అంటూ 2022 లో ట్వీట్ చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే ఎంపీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి.. రెండు కాదు.. ఐదు రోజుల పాటు 50 మంది బ్యాంకు సిబ్బంది, 20 కౌంటింగ్ మెషిన్లతో లెక్కించినా ఇంకా పూర్తికాలేదు. దీంతో సదరు ఎంపీని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. బీజేపీ ఐటీ సెల్ నేషనల్ కన్వీనర్ అమిత్ మాలవీయ ఆ ఎంపీని ఏకంగా కరప్షన్ డాన్ అని ట్వీట్ చేశారు. ఆయన బలే కామెడీ చేస్తాడని అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ఎంపీ మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ ఝార్ఖండ్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు.

 ఝార్ఖండ్ కు చెందిన లిక్కర్ బిజినెస్ మ్యాన్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు నివాసం, ఆఫీసులలో ఐటీ శాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారంతో చేసిన ఈ దాడులతో దేశంలో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో చూడనంత సొమ్ము బయటపడింది. ఎక్కడ చూసినా నోట్ల కట్టల గుట్టలే కనిపించాయి. వందలాది బ్యాగుల్లో అన్నీ రూ.500 నోట్లే ఉన్నాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు బ్యాంకు సిబ్బందిని పిలిపించి, కౌంటింగ్ మెషిన్లతో లెక్కించడం ప్రారంభించారు. ఐదు రోజులుగా లెక్కింపు జరుగుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు.

ఈ నేపథ్యంలోనే ధీరజ్ ప్రసాద్ సాహు 2022 లో చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ‘పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో బ్లాక్ మనీ దొరకడం ఆవేదన కలిగిస్తోంది. ఇంతలేసి నోట్ల కట్టలను వాళ్లు ఎలా పోగేస్తున్నారో నాకు అర్ధం కావడంలేదు. ఈ దేశంలో అవినీతిని రూపుమాపే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది’ అంటూ ధీరజ్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ధీరజ్ ప్రసాద్ పై కాంగ్రెస్ కు ఎనలేని ప్రేమ అని అమిత్ మాలవీయ ఆరోపించారు. ఎంతగా అంటే.. 2009 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ధీరజ్ ఓడిపోయాడు. దీంతో అదే ఏడాది జూన్ లో ధీరజ్ ను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకుని పార్లమెంట్ కు పంపించిందని మాలవీయ మండిపడ్డారు.

More Telugu News