Pawan Kalyan: అత్తారింటికి దారేది అంటే చెప్పవచ్చు కానీ...!: పవన్ కల్యాణ్

  • విశాఖపట్నంలో  జనసేన సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నానని వెల్లడి
  • అనేక హేళనలను ఎదుర్కొన్నానని వివరణ
  • యువత తమ శక్తిని ఓట్ల రూపంలో చూపించాలని పిలుపు
  • తాను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ
Pawan Kalyan speech in Vizag

విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం అన్ని జిల్లాలను ఏకం చేసిందని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రులను ఏకతాటిపై ఉంచిందని వెల్లడించారు. అలాంటి పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నారన్న నేపథ్యంలో... విశాఖ ఉక్కు గురించి అమిత్ షాతో మాట్లాడితే, ఆయన తన అభిప్రాయాన్ని గౌరవించారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామని అన్నారు. విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశం అని, ఇదే విషయాన్ని కేంద్రం పెద్దలకు వివరించానని పవన్ తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే అది ఎలాంటి భావోద్వేగ పరిస్థితులకు దారితీస్తుందో తెలియదని వారికి స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. తాను ఎప్పుడూ ఎన్నికలను దృష్టిలో  ఉంచుకుని ఆలోచించలేదని, ఒక తరం భవిష్యత్తు కోసం ఆలోచించానని స్పష్టం చేశారు. 

2008 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, అయితే, తాను రాజకీయాల్లోకి వస్తే తన వెంట నడిచేది 14 ఏళ్ల కుర్రాళ్లు మాత్రమేనన్న హేళనలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. వీళ్లతో మాట్లాడితే ఓట్లు వస్తాయి, వీళ్లకు నమస్కారాలు పెడితే ఓట్లు వస్తాయి అని ఎప్పుడూ ఆలోచించలేదని, తాను వచ్చింది ఓట్ల కోసం కాదని, మార్పు కోసం అని ఉద్ఘాటించారు. ఆశయం ఉన్నవాడికి ఓటమి ఎప్పుడూ భయం కలిగించదని, తాను కూడా ఓటమిని తేలిగ్గా తీసుకున్నానని వివరించారు. పోరాడాను కాబట్టి ఓటమి కూడా తనకు గెలుపులానే అనిపిస్తుందని అన్నారు. 

"కొందరు పొగడ్తలకు ఉప్పొంగిపోతారేమో కానీ... నేను మాత్రం నాకు తగిలిన ప్రతి దెబ్బకు ఉప్పొంగిపోతాను, ప్రతి ఓటమికి ఉప్పొంగిపోతాను. నేను పనిచేశాను.... కష్టపడ్డాను. వెటకారాలు నాకు తెలుసు, వ్యంగ్యాస్త్రాలు విసురుతారు. నేను వీటన్నింటిని భరిస్తోంది మీ భవిష్యత్తు కోసమే. 

ఉత్తరాంధ్ర యువత వలసలు ఆగాలి. మొన్న తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చెప్పాను. తెలంగాణ కోసం 1200 మంది యువత ఆత్మబలిదానం చేసుకున్నారు. కానీ ఏపీలో యువత పోరాట బాట కాకుండా... ఉపాధి కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఇది నాకు చాలా బాధగా ఉంది. వైసీపీ వారికి 151 మందిని ఇస్తే వారు కనీసం జాబ్ కాలెండర్ కూడా ఇవ్వడంలేదు" అని పవన్ పేర్కొన్నారు. 

ఒక మనిషిని ఎప్పడూ కేవలం గెలుపు ప్రాతిపదికన అంచనా వేయొద్దని పవన్ స్పష్టం చేశారు. తాను ఓటమిపాలైనప్పటికీ ప్రజల కోసం నిలబడ్డానని, గత పదేళ్లుగా తాను పోరాడుతోంది ప్రజా సమస్యలపైనే అని వివరించారు. 

"ఈ సమాజం త్యాగాలతోనే నిర్మితమైంది. రాజకీయాలు కలుషితం అయిపోయాయి, అవినీతి చోటుచేసుకుంటోంది అన్న కారణాలతో యువత రాజకీయాలను నమ్మడం లేదు. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాలంటే రాజకీయాల్లో మీ పాత్ర ఉండాలి. మీ పాత్ర ఉండాలంటే మీకోసం నిలబడే వ్యక్తులు ఉండాలి. దెబ్బతిన్నా గానీ నిలబడే వ్యక్తులు ఉంటే వ్యవస్థ మారుతుందని నా ప్రగాఢ విశ్వాసం. 

నేను సినిమాల్లో కొనసాగి ఉంటే నేనింత ఇబ్బంది పడనక్కర్లేదు. కేవలం సినిమాలే చేసుకుంటూ వెళితే నాది చాలా స్వార్థమైన జీవితం అనిపిస్తుంది. సినిమాలతో నేను కొన్ని వందల కోట్లు సంపాదించుకోగలను, అప్పుడు నేను ఒక్కడినే బతుకుతాను, ఏవో కొన్ని దానధర్మాలు చేయొచ్చు. కానీ మనసుకు తృప్తి మాత్రం లభించదు. మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వగలిగితే నేను సంపాదించే డబ్బుకు వందల రెట్లు అధిక సంతృప్తినిస్తుంది. 

మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి కదా. నేను అధికారం కోసం ఓట్లు అడగడంలేదు, మార్పు కోసం ఓట్లు అడుతున్నాం. ఇవాళ నేను మీకు మాట ఇస్తున్నా. ఉత్తరాంధ్ర వారికి ఉపాధి అవకాశాలు ఇక్కడే లభించేలా మనస్ఫూర్తిగా నేను కృషి చేస్తాను. ఒక్కసారి నేనేంటో చూడండి... ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోతే, పైగా ఓటమిపాలైతే ఎవరికైనా భయం కలుగుతుంది. కానీ నేను ఇన్నేళ్ల బట్టి వరుస ఓటములను ఎదుర్కొంటూనే ఎదుగుతూనే ఉన్నాను... ఎక్కడ ఆగలేదు. 150 మందితో ప్రారంభమైన జనసేన ఇవాళ ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులతో కొనసాగుతోంది. 

అమెరికా గత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మొదట్లో అనేక ఓటములు ఎదుర్కొన్నాడు. న్యాయవాద ఎన్నికల్లో, సెనేటర్ ఎన్నికల్లో, గవర్నర్ ఎన్నికల్లో కూడా ఓడిపోయాడు. చివరికి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఆయన అనుభవం ఏం చెబుతుందంటే... మనం అనుక్షణం యుద్ధానికి సన్నద్ధమవుతూ ఎదుగుతూ వెళ్లడమే. దీనికి దగ్గరదారులు అంటూ ఏవీ లేవు. నిలబడి నీ సత్తా చూపించడమే నాయకుడి తాలూకు కర్తవ్యం. 

ఇప్పటికిప్పుడు నేను వెళ్లి బీజేపీలో చేరితే నేను కోరుకున్న పదవి ఇస్తారు. కానీ, రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా మనం ఇంకా రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉంది? రాష్ట్ర రాజధాని ఏది? అత్తారింటికి దారేది లాగా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏది? అని వెతుక్కుంటున్నాం. అత్తారింటికి దారేది అంటూ మూడు గంటల్లో కథ చెప్పేయొచ్చు... కానీ రాజధాని దారేదంటే కథ చెప్పలేం ఇక్కడ! ఇవాళ కూడా ఏపీకి రాజధాని లేదు. ఏపీ రాజధాని గురించి ప్రతిసారి ఢిల్లీ నుంచి ఎవరో ఒకరు చెప్పాలి. 

ఈ వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? ఉద్దానం కిడ్నీ సమస్య గురించి నేను వచ్చి చెప్పేంత వరకు మీకు తెలియదా? నన్ను విమర్శించే ఉత్తరాంధ్ర నాయకులను ప్రశ్నిస్తున్నా... ఉద్దానం సమస్యను ఎందుకు పట్టించుకోలేకపోయారు?" అంటూ పవన్ మండిపడ్డారు. 

ఈ సందర్భంగా సభకు వచ్చినవాళ్లు జేజేలు పలకడంతో పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా జేజేలు పలికితే ఎనర్జీ వృథా అవుతుందని, ఆ శక్తిని ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించాలని పిలుపునిచ్చారు.

More Telugu News