Gram Panchayat Elections: తెలంగాణలో ఇక గ్రామపంచాయతీ ఎన్నికలు!. మొదలైన కసరత్తు

  • నిర్వహణపై కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలు సిద్ధం చేయాలంటూ కలెక్టర్లకు లేఖ
  • పోలింగ్ స్టేషన్ ఎంపికతోపాటు పలు అంశాలపై సూచనలు
  • జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం
Gram panchayat elections to be held in Telangana

తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31న ముగియనుంది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో జిల్లాల వారీగా రిపోర్ట్ సిద్ధం చేయాలంటూ కలెక్టర్లకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌ ఈ మేరకు లేఖ పంపించారు.

డిసెంబర్ 30లోపు కసరత్తు పూర్తిచేసి వివరాలు అందించాలని కోరారు. ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో పోలింగ్‌ స్టేషన్ల ఎంపిక, పోలింగ్‌ సిబ్బంది రాండమైజేషన్‌ సిస్టమ్‌ సాప్ట్‌వేర్‌ అప్లికేషన్‌లో వివరాలు నమోదు చేయడం వంటి వాటిపై కలెక్టర్లకు కీలకమైన సూచనలు చేశారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శులు ఎన్నికల సంఘానికి పంపించారు. 

తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు, లక్షా 13 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. అయితే ఇవి ముందస్తు ఏర్పాట్లు మాత్రమేనని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనేది నూతనంగా ఏర్పడబోయే గవర్నమెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మరోపక్క, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పార్లమెంటు ఎన్నికలు షురూ కానున్న విషయం తెలిసిందే.

More Telugu News