Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై నేడు క్లారిటీ.. ఖర్గేతో డీకే, మాణిక్‌రావు ఠాక్రే భేటీ

  • ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధిష్ఠానం తర్జన భర్జన
  • నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు కాంగ్రెస్ చీఫ్‌తో డీకే, ఠాక్రే భేటీతో స్పష్టత
  • ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
DK and Manikrao Thakare to meet Mallikarjun Kharge today

తెలంగాణలో సంచలన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపికలో తర్జనభర్జన పడుతోంది. సీఎంగా ఎవరుండాలనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే నేడు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గేతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇందుకు వీరిద్దరూ గత రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం జరిగే అవకాశం ఉంది.

నిజానికి గత రాత్రే రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే, సీఎం అభ్యర్థిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఖర్గేతో నేటి భేటీ తర్వాత సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News