Janasena: తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ‘జనసేన శతఘ్ని’ టీమ్

  • తమకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు కాదని వ్యాఖ్య
  • తెలంగాణ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేశామని గర్వంగా చెప్పుకోగలమని వైసీపీకి కౌంటర్
  • తెలంగాణ ప్రజలపై మీకు బాధ్యత లేదా? అంటూ ప్రశ్నించిన జనసేన శతఘ్ని టీమ్
Janasena Shataghni team reacted to criticism on defeat in the Telangana elections

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 8 చోట్ల పోటీ చేసిన జనసేనకు ప్రతికూల ఫలితం ఎదురైంది. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో జనసేనపై ఆంధ్రప్రదేశ్‌‌లో పాలక పక్షం వైఎస్సాఆర్‌సీపీ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురైందని, పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని విమర్శిస్తోంది. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ పోస్టుకు ‘జనసేన శతఘ్ని’ టీమ్ కౌంటర్ ఇచ్చింది.

గెలిచినా ఓడినా తాము తెలంగాణ ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేశామని గర్వంగా చెప్పుకోగలమని బదులిచ్చింది. ఎందుకంటే తమకు ఆంధ్రప్రదేశ్ ఒకటి.. తెలంగాణ ఒకటి కాదని పేర్కొంది. తెలుగు ప్రజల బాగుకోసం ఓటమిని భరించి పని చేస్తామని వెల్లడించింది. ‘‘ వైసీపీ అధినేత జగన్ తెలంగాణాలో పార్టీని ఎందుకు ఎత్తేసినట్టు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని ఆదరించిన తెలంగాణ ప్రజలపై మీకు బాధ్యత లేదా? "రాజన్నరాజ్యం"లో బ్రతికే భాగ్యం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఎందుకు? ఎందుకంటే తెలంగాణని దోచుకుతిన్న జగన్‌కి తెలంగాణలో పోటీ చేసే నైతిక హక్కు, ధైర్యం లేవు కనుక. మానుకోట ఉదంతం పీడకలలా వెంటాడుతుంది కాబట్టి. మరి ఇన్ని మచ్చలు కింద పెట్టుకుని పార్టీ జెండా మడిచి వెనుక పెట్టుకుని పారిపోయిన మీకు తెలంగాణ ఫలితాలపై మాట్లాడే ముందు కొంచెం సిగ్గు అనిపించి ఉండాలి’’ అంటూ జనసేన శతఘ్ని టీమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

కాగా వైఎస్సార్‌సీపీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన పోస్ట్‌లో జనసేనను ‘సున్నాసేన’ అని అభివర్ణించింది. జనసేన అభ్యర్థులకు టీడీపీ మద్దతుదారులు ఓటు వేయలేని, పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన డిపాజిట్లు కోల్పోయిందని విమర్శించింది.

More Telugu News