BTech Ravi: నన్ను ఎవరు విచారిస్తున్నారో తెలుసుకునే వీల్లేకుండా చేశారు: బీటెక్ రవి

  • పది నెలల కిందటి కేసులో ఇటీవల బీటెక్ రవి అరెస్ట్
  • బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • పులివెందులలో టీడీపీ ఆఫీసు ఏర్పాటు జగన్ కు నచ్చలేదన్న బీటెక్ రవి
  • అందుకే కుట్రలు పన్నాడని ఆరోపణ
BTech Ravi talks to media

సీఎం జగన్ తనను నవంబరు 14న పోలీసులతో కిడ్నాప్ చేయించి, చంపించేందుకు కుట్ర చేశారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి ఆరోపించారు. ఇటీవల ఓ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసిన తీరు దారుణమని అన్నారు. రాజకీయ కక్షలతోనే పోలీసులతో ఇలాంటి దుశ్చర్యకు ఒడిగట్టారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీటెక్ రవికి కొన్నిరోజుల కిందటే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. 

"నన్ను అరెస్ట్ చేసింది విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలో. ఆ వ్యవహారం జరిగి కూడా 10 నెలలు అవుతోంది. నోటీసులు ఇస్తే నేనే లొంగిపోతానని కూడా పోలీసులకు చెప్పాను. కానీ వాళ్లు... అదేమీ అవసరం లేదు సర్.. ఇది స్టేషన్ బెయిల్ కేసేనని తేలిగ్గా చెప్పారు. నేను పాస్ పోర్టు తీసుకునే సమయంలో ఈ కేసు అడ్డం వచ్చింది. దాంతో కోర్టుకు వెళితే, పోలీసులు కూడా ఇది 353 సెక్షన్ కేసేనని చెప్పారు. ఆ లెక్కన విమానాశ్రయం వద్ద ఘటన సబ్జెక్టే కాదు. 

సీఎం జగన్ కు మాతో ఇబ్బందిగా ఉంది. ఇటీవలే నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు ప్రారంభించాం. ఇది జగన్ కు ఆగ్రహం తెప్పించింది. దాంతో మమ్మల్ని అడ్డు తొలగించుకునేందుకు పోలీసులను అడ్డంపెట్టుకుని జగన్ పన్నిన ప్లాన్ ఇది" అని ఆరోపించారు. 

పోలీసులు నిజంగా చట్టానికి లోబడి నన్ను అరెస్ట్ చేసి ఉంటే కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని బీటెక్ రవి అన్నారు. నన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత నా గన్ మెన్, నా డ్రైవర్, నా మనుషుల సెల్ ఫోన్లు స్విచాఫ్ చేయించి రెండు గంటల పాటు వాహనాల్లోనే కూర్చోబెట్టారు అని వెల్లడించారు. మనం ఏదైనా సమస్య వస్తే పోలీసుల వద్దకు వెళతాం... కానీ పోలీసులే నన్ను కిడ్నాప్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు అంటూ బీటెక్ రవి వాపోయారు. నా అదృష్టం బాగుండి, విధిలేని పరిస్థితుల్లో మమ్మల్ని వదిలిపెట్టారు అని వివరించారు. 

రెండున్నర గంటల పాటు సాగిన విచారణలో తనను ఎవరూ చిత్రహింసలు పెట్టలేదని, తనను ఎవరూ టచ్ చేయలేదని స్పష్టం చేశారు. అయితే, కళ్లకు గంతలు కట్టి, తనను ఎవరు విచారిస్తున్నారో తెలుసుకునే వీల్లేకుండా చేశారని బీటెక్ రవి వెల్లడించారు. 

వైఎస్ వివేకా కుమార్తె సునీత గురించి తనను ప్రశ్నించారని తెలిపారు. చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా... సునీత గారికి కూడా న్యాయవాదేనని పేర్కొన్నారు. 

"సునీతను రాజకీయాల్లోకి రావాలంటూ నువ్వొక వైపు, సిద్ధార్థ లూథ్రా మరోవైపు ప్రయత్నం చేస్తున్నారట కదా... మర్యాదగా నిజం చెప్పు... లేకపోతే నిన్ను షూట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి అని బెదిరించారు. సీఎంపైనే పోటీ చేసేంతటివాడివా... నియోజకవర్గంలో ఆఫీసులు కూడా తెరుస్తున్నావంట... నిన్ను షూట్ చేస్తే దిక్కెవరు? అని కూడా మాట్లాడారు. బీజేపీతో పొత్తు కోసం సీఎం రమేశ్, అమిత్ షాతో మధ్యవర్తిత్వం చేస్తున్నాడట కదా అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబుతో, లోకేశ్ తో నేను ఏవైనా కీలక విషయాలు మాట్లాడానా అనేదాని కోసం నా ఫోన్ డేటా అంతా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. చివరికి నా వేలిముద్రలు కూడా తీసుకున్నారు" అని బీటెక్ రవి వివరించారు.

More Telugu News