Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ను ఎలా లెక్కిస్తారు? అంచనాలు ఎంత వరకు నిజం?

  • పోలింగ్ రోజు ఓటరు మనోగతం తెలుసుకుని వెల్లడించే ప్రక్రియ
  • నేటి సాయంత్రం 5:30 గంటలకు ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్
  • పూర్తిగా నమ్మశక్యం కానప్పటికీ పలు అంశాలపై స్థూలమైన అంచనా
Telangana Assembly Election Exit Poll Result 2023 Date And Time Of Opinion Poll For Telangana Election

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో చివరగా తెలంగాణలో నేడు పోలింగ్ కొనసాగుతోంది. మిగతా నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరంలలో పోలింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత.. అంటే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుండగా 5:30 గంటలకు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. పోలింగ్ లో ఓటరు ఎవరివైపు మొగ్గు చూపారనే విషయాన్ని చాలా వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తాయి.

పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఫలితాల వెల్లడికి మధ్య ఉన్న గ్యాప్ లో పార్టీల జయాపజయాలపై అంచనాలను వ్యక్తం చేసేవే ఈ ఎగ్జిట్ పోల్స్.. ఇందులో వెల్లడించే లెక్కలు పూర్తిగా నమ్మదగినవని చెప్పలేం. అదే సమయంలో పూర్తిగా తీసిపారేయడానికీ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రక్రియ గురించి స్థూలంగా చెప్పాలంటే.. పోలింగ్ నాటి పరిస్థితులను, ఓటర్ల నాడిని అంచనా వేసే ప్రాసెస్. పోలింగ్ సరళిపై వివరణాత్మక సమాచారం అందిస్తాయి. వీటితో విజేతలను అంచనా వేయవచ్చని అంటున్నారు.

పోలింగ్ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహించడమే ఎగ్జిట్ పోల్స్.. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో మాట్లాడి, పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వస్తారు. ఇలా సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది లెక్కకడతారు. ప్రీ పోల్ సర్వేకు ఎగ్జిట్ పోల్స్ కు ప్రధానమైన తేడా.. ప్రీపోల్ సర్వేలో వివిధ వర్గాల వారీగా ఓటర్లను ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు. ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. పోలింగ్ రోజే ఓటేసేందుకు వచ్చే వారిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తారు. దీనివల్ల ఎగ్జిట్ పోల్స్ లో కచ్చితత్వం పాళ్లు ఎక్కువ. ఈ అంచనాలు దాదాపుగా రిజల్ట్ కు దగ్గరగా ఉంటాయి. అయితే, పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మందిని ప్రశ్నించి పకడ్బందీగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

సాయంత్రం 5:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. పోలింగ్ ముగిసిన గంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవచ్చు. అంటే సాయంత్రం 6 గంటలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. అయితే, ఎన్నికల సంఘం తాజా సూచనల మేరకు సాయంత్రం 5:30 గంటలకే.. అంటే తెలంగాణలో పోలింగ్ టైం ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు. దీంతో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాల వివరాలు సాయంత్రం 5:30 గంటలకు తెలుసుకోవచ్చు.

More Telugu News