Loksatta: ఎవరికి ఓటేసినా ఒకటే అనే కసితో ఓటేయొద్దు: జయప్రకాశ్ నారాయణ్

ఏ పార్టీ చూసినా అదే కథ.. అన్ని పార్టీలూ ఓటర్లను డబ్బుతో కొంటున్నాయి. ఇక ఎవరికి ఓటేస్తేనేం అనే కసితో ఓటేయొద్దంటూ లోక్ సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లకు ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. కోపంతో, కసితో ఓటు వేయొద్దని, ఆలోచనతో మన బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

పార్టీలన్నీ ఒకే తీరుగా ఉన్నాయని, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని, అవినీతికి పాల్పడుతున్నాయని విసుగు చెంద వద్దని ఆయన హితవు పలికారు. పార్టీలు, అభ్యర్థుల మధ్య మౌలిక తేడాను గుర్తించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ఏది దోహదం చేస్తుందో చూడాలని చెప్పారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బంతా తాత్కాలిక తాయిలాలకు, ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానానికి ఖర్చు చేసి భవిష్యత్తును నాశనం చేస్తుందో గమనించాలని జయప్రకాశ్ నారాయణ్ సూచించారు.

గురువారం (ఈ నెల 30) న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్రంలోని యువతకు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి చేశారు. మీ భవిష్యత్తును కాపాడుతూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడే పార్టీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Loksatta
Jayaprakash Narayan
assembly polls
Telangana
vote
jp advice
voters

More Telugu News