Padi Kaushik Reddy: తనను గెలిపించకుంటే ఉరేసుకుంటానన్న బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

  • హనుమకొండ ఎన్నికల ప్రచారంలో కౌశిక్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
  • తనను గెలిపించకుంటే కమలాపూర్ బస్టాండ్‌లో కుటుంబంతో కలిసి ఉరేసుకుంటానని హెచ్చరిక
  • ఓటర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాల విమర్శలు
  • విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఈసీ
Election Commission Orders Probe On BRS Candidate Padi Kaushik Reddy Comments

తనను గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే తన శవయాత్రకు రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌రెడ్డి నిన్న తన భార్య, కుమార్తెతో కలిసి హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను గెలిపించకుంటే కుటుంబమంతా కలిసి కమలాపూర్ బస్టాండ్‌లో ఉరేసుకుంటామని హెచ్చరించారు. తనకు ఓటేసి గెలిపించకుంటే ముగ్గురు శవాలను చూడాల్సి వస్తుందన్నారు. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే 4న తన శవయాత్రకు రావాలని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓటర్లను ఆయన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ పలు పార్టీల నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ దర్యాప్తునకు ఆదేశించింది.

More Telugu News