KTR: కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చాక రియాల్టీ రంగం 28 శాతం పడిపోయింది.. తెలంగాణలో గెలిస్తే ఢమాల్: కేటీఆర్

  • టీవీ9 నిర్వహించిన మెగా కాన్‌క్లేవ్‌లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
  • పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో రియాల్టీ రంగం పడిపోతుందని వ్యాఖ్య
  • తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని తేల్చి చెప్పిన కేటీఆర్
  • బీఆర్ఎస్‌కు 70 నుంచి 82 సీట్లు వస్తాయని జోస్యం
Minister KTR hot comments on real esatate business

పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీ9 నిర్వహించిన మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి  అన్నారు. అయితే, చివరకు గెలిచేది మాత్రం బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. తమకు 70 నుంచి 82 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌ను కోరుకుంటోందని.. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి దక్షిణాదిన తొలి హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంపై మాట్లాడారు.

పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రియాల్టీ రంగం ఢమాల్‌ అవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ప్రతి ఆరునెలలకో ముఖ్యమంత్రిని మారుస్తుంటారని, అలాంటి పరిస్థితుల్లో స్థిరమైన పాలన ఎలా ఇవ్వగలరు? అందుకే రియల్ ఎస్టేట్ పడిపోతుందన్నారు. అదే సమయంలో పాలనాపరమైన నిర్ణయాలను కూడా త్వరితగతిన తీసుకోలేరని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బెంగళూరులో రియాల్టీ రంగం 28 శాతం మేర పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో శరవేగంగా పెరుగుతోందన్నారు.

More Telugu News