NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు

  • ఆగస్టు 28న ఎన్టీఆర్ పేరిట స్మారక నాణెం విడుదల
  • ఇప్పటివరకు 25 వేల నాణేల అమ్మకం
  • స్మారక నాణేల్లో ఇదే రికార్డు అని హైదరాబాద్ మింట్ అధికారుల వెల్లడి
NTR memorial coin sets record in sales

భారతదేశంలో ప్రముఖుల పేరిట స్మారక నాణేలు విడుదల చేయడం 1964 నుంచి కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు అనేక మంది మహనీయుల ముఖచిత్రాలతో స్మారక నాణేలు విడుదల చేసినా, వాటిన్నింటిని మించి ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాల పరంగా రికార్డు సృష్టించింది. 

ఆగస్టు 28న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేశారు. అప్పటినుంచి ఈ నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ముద్రిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు అమ్ముడయ్యాయి. 

భారత్ లో ఇంతవరకు ఇదే రికార్డు అని హైదరాబాద్ మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. గతంలో ఈ రికార్డు 12 వేల అమ్మకాలు కాగా... ఇప్పుడు అంతకు రెండింతల అమ్మకాలతో ఎన్టీఆర్ స్మారక నాణేలు రికార్డు నెలకొల్పాయని వివరించారు. 

ఇవాళ హైదరాబాదులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మింట్ అధికారులు కూడా హాజరై రికార్డు వివరాలు తెలిపారు.

ఈ సందర్భంగా టీడీ జనార్దన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయం తథ్యమని అన్నారు. ఇప్పటివరకు దేశంలో వివిధ రంగాల ప్రముఖులు, వివిధ చారిత్రక ఘట్టాలపై 200 స్మారక నాణేలు విడుదల చేయగా, వాటిలో ఎన్టీఆర్ నాణెం అమ్మకాల పరంగా ముందు వరుసలో ఉందని తెలిపారు.

More Telugu News