Nadendla Manohar: 26న పవన్ కల్యాణ్ కూకట్ పల్లిలో ప్రచారం చేస్తారు: నాదెండ్ల మనోహర్

  • అమిత్ షాతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి
  • ఉమ్మడి రాష్ట్రంలో అందరి కృషితోనే హైదరాబాద్ మహా నగరంగా మారింద్న నాదెండ్ల
  • కూకట్‌పల్లిలో గెలిచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశమిద్దామని పిలుపు
Nadendla Manohar interesting comments on Hyderabad development

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 26న కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శనివారం కూకట్‌పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 26న పవన్ కూకట్‌పల్లిలో ప్రచారం చేస్తారని, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్ల కోసం అడిగామని, కానీ అనుకోని కారణాల వల్ల శేరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చిందన్నారు.

అందరూ కృషి చేస్తేనే హైదరాబాద్ నగరంగా... మహా నగరంగా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి అందరం తోడ్పడ్డామన్నారు. ఏపీ నుంచి వచ్చిన ఎంతోమంది ఇక్కడికి వచ్చి పనిచేసి.. సంపాదించుకున్నది.. ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నారన్నారు. టీడీపీ, వైసీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నాయని, ఇక్కడి వారి తరపున నిలబడేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుందన్నారు. కూకట్‌పల్లిలో గెలిచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశం ఇద్దామన్నారు. వర్తమాన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వంటి నాయకుడు లేడన్నారు. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.

More Telugu News