CBN Vision-2047: హైదరాబాదులో సీబీఎన్ విజన్-2047 ఫోరం ఆవిష్కరణ

  • ఇటీవల విజన్-2047 ప్రకటించిన చంద్రబాబు
  • హైదరాబాదులోని మినర్వా హోటల్ లో కార్యక్రమం
  • హాజరైన కొల్లు రవీంద్ర, రఘురామ, ఉండవల్లి శ్రీదేవి
CBN Vision 2047 launches in Hyderabad

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల విజన్-2047 ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో సీబీఎన్ విజన్-2047 ఫోరంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కొండాపూర్ లోని మినర్వా హోటల్ లో జరిగింది. 

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, దేశంలో మరే నాయకుడు ఆలోచించని విధంగా చంద్రబాబు విజన్-2047కి రూపకల్పన చేశారని కొనియాడారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడం దురదృష్టకరమని, టీడీపీ అధికారంలో ఉండుంటే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయ్యేదని అన్నారు. చంద్రబాబు ఎంతో దార్శనికతతో నదుల అనుసంధానం చేపట్టారని వెల్లడించారు. ఏపీ ప్రజలు మరోసారి తప్పు చేయకుండా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో విజన్-2020 పేరుతో యావత్ ప్రపంచం దృష్టిని ఏపీ వైపు తిప్పారని కొనియాడారు. చంద్రబాబుకు తెలుగు మహిళలంతా అండగా ఉన్నారని తెలిపారు.

More Telugu News