Virat Kohli: కింగ్ కు అరుదైన గౌరవం... జైపూర్ లో కోహ్లీ మైనపు విగ్రహం

  • ఇటీవల వన్డేల్లో 50వ సెంచరీ సాధించిన కోహ్లీ
  • సచిన్ రికార్డు తెరమరుగు
  • జైపూర్ నహర్ గఢ్ కోటలో వ్యాక్స్ మ్యూజియం
  • కోహ్లీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు
Kohli wax statue will be installed soon

టీమిండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో సెమీస్ లో 50వ సెంచరీ సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ పలు రికార్డులను సవరించాడు. ఈ నేపథ్యంలో, టీమిండియా కింగ్ కు అరుదైన గౌరవం లభించింది. జైపూర్ లోని నహర్ గఢ్ కోటలో ఉన్న మైనపు విగ్రహాల మ్యూజియంలో కోహ్లీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నారు. 

దీనిపై జైపూర్ వ్యాక్స్ మ్యూజియం వ్యవస్థాప డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ స్పందించారు. ఇక్కడ కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలంటూ పర్యాటకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలతో అద్భుతమైన రికార్డు నమోదు చేశాడని, మరోవైపు భారత్ వరల్డ్ కప్ టైటిల్ కు చేరువలో నిలిచిందని, విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఏముంటుందని అన్నారు. 

ప్రస్తుతానికి బంక మన్నుతో కోహ్లీ నమూనా విగ్రహాన్ని రూపొందించామని, మరో నెలలో పూర్తిస్థాయి మైనపు విగ్రహం తయారుచేస్తామని శ్రీవాస్తవ చెప్పారు. కోహ్లీకి ఎంతో ఇష్టమైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాన్ని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

More Telugu News