India Vs New Zealand: మరికాసేపట్లో భారత్-కివీస్ సెమీస్ పోరు.. ఫలితాన్ని నిర్ణయించేంది ఇదే!

  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే వున్న ఇరు జట్లు
  • భారత్‌పై గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్ చేరుకోవాలని కివీస్ పట్టుదల
  • కివీస్‌ను భయపెడుతున్న చివరిదశ అడ్డంకులు
  • భారత్ కూడా సేమ్ టు సేమ్
  • సెమీస్ పోరులో కీలకం కానున్న టాస్
  • ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ఉపాయం
This Acts Key Roll In India Kiwis Semi Final Match in Wankhede

ప్రపంచకప్‌లో తిరుగులేని విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టిన భారత జట్టు మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత్‌కు డ్రీమ్‌రన్‌గా మిగిలిపోనుంది. ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ దశలో కివీస్‌ను ఓడించిన టీమిండియా 2019 నాటి సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. గత రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరుకున్న కివీస్ ఈసారి కూడా ఫైనల్‌కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. అదే జరిగితే ఆ జట్టు ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. ఆస్ట్రేలియా ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. 

ఇటీవలి కాలంలో స్థిరంగా ఆడుతున్న న్యూజిలాండ్ చివరి అడ్డంకిని దాటడంలో మాత్రం విఫలమవుతోంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశలో భారత్‌పై ఎన్నడూ ఓటమి చవిచూడని కివీస్ నేటి మ్యాచ్‌లోనూ ఆ రికార్డును కొనసాగించి ఫైనల్స్‌కు దూసుకెళ్లాలని పట్టుదలగా ఉంది. న్యూజిలాండ్ మాదిరిగానే ఇండియా కూడా చివరి దశలో అడ్డంకులు ఎదుర్కొంటోంది. భారత్ గత నాలుగేళ్లలో రెండు ప్రపంచకప్‌లు (వన్డే, టీ20)  సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైంది. రెండుసార్లు వరుసగా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుకుంది. మరోవైపు, ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌లోకి ప్రవేశించి దేశానికి తొలి ప్రపంచకప్ అందించాలని ఉవ్విళ్లూరుతోంది. 

భారత్-న్యూజిలాండ్ జట్లు రెండూ బలంగా ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉంది. కివీస్ కూడా బ్యాటింగ్‌తోపాటు పేస్ అటాక్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. సెమీస్ పోరుపై టీమిండియా స్కిప్పర్ రోహిత్‌శర్మ మాట్లాడుతూ.. ఇరు జట్ల బలాబలాలు, వాంఖడేలో జరిగిన గత మ్యాచ్‌లు ఫలితాన్ని నిర్ణయించబోవని, టాస్ మాత్రమే దానిని నిర్ణయిస్తుందని చెప్పాడు. 

టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. భారీ స్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంతోపాటు స్కోరును కాపాడుకునే అవకాశం ఉందని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇదే స్టేడియంలో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత్ 55 పరుగులకే కుప్పకూల్చింది. శ్రీలంక కోల్పోయిన పది వికెట్లలో 9 పేసర్లకే దక్కాయి. షమీ ఒక వికెట్ తీయగా, సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. 

కాబట్టి కివీస్‌ జట్టులోని ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గ్యూసన్ వంటి దిగ్గజాలను ఎదుర్కోవడం భారత్‌కు కష్టంగా మారొచ్చు. ఒకవేళ టార్గెట్ చేయాల్సి వచ్చినా షమీ, బుమ్రా, సిరాజ్‌ను ఎదుర్కొనేందుకు కివీస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. టాస్ గెలిస్తే భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడమే మంచిదని లెజండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు.

More Telugu News