Agra: రూ.440 నష్టం..రైల్వేపై ప్రయాణికుడి అలుపెరగని పోరాటం..అద్భుత విజయం!

  • ఆగ్రా ప్రయాణికుడికి 2017లో ఊహించని అనుభవం
  • ఏసీ టూ టైర్ టిక్కెట్‌ కొంటే కనిపించని బోగీ, చివరకు త్రీ టైర్‌ లోనే ప్రయాణం
  • పరిహారం కోసం చేసిన అభ్యర్థనను నార్త్ సెంట్రల్ రైల్వే బుట్టదాఖలు 
  • మడమతిప్పకుండా న్యాయపోరాటం చేసి గెలిచి పరిహారం పొందిన ప్రయాణికుడు
Agra man wins 5 year battle for Rs 440 from Railways

రైల్వేలో ఏసీ 2 టైర్ టిక్కెట్టు కొన్న ఆ ప్రయాణికుడు రూ.440 నష్టాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. పోతేపోనీలే అనుకుని విషయాన్ని అక్కడితో వదిలేయచ్చు. కానీ, అతడు రైల్వేకు ఓ గుణపాఠం చెప్పాలనుకున్నాడు. తనలాగా ఇబ్బంది పడ్డ ఇతర ప్రయాణికుల కోసం రైల్వేను కోర్టుకు లాగి చివరకు విజయం సాధించాడు. 

ఆగ్రాకు చెందిన మున్నాలాల్ 2017లో బండా జంక్షన్ నుంచి ఆగ్రా కంటోన్మెంట్ వెళ్లేందుకు తత్కాల్ కోటా కింద రూ.1570 పెట్టి ఏసీ టూ టైర్ టిక్కెట్టు కొనుగోలు చేశాడు. కానీ స్టేషన్‌కు వెళ్లేసరికి రైల్లో టూటైర్ ఏసీ కంపార్ట్‌మెంట్ కనిపించక అవాక్కయ్యాడు. కంగారులో బోగీను చూడలేదేమో అనుకుని ప్లాట్‌ఫాంపై పలుమార్లు అటూ ఇటూ పరుగులు తీశాడు. చివరకు రైలు కదులుతున్న టైంలో కనిపించిన బోగీలో ఎక్కేశాడు. అక్కడి టీసీకి తన గోడు వెళ్లబోసుకోగా అతడిది అరణ్యరోదనే అయ్యింది. చివరకు, టీసీకి రూ.1130 చెల్లించి త్రీ టైం కంపార్ట్‌మెంట్‌లో సీటు తీసుకున్నాడు. కానీ తన సీటు వద్దకు వెళ్లిన మున్నాలాల్‌కు అక్కడ మరో ప్రయాణికుడు కనిపించడంతో మళ్లీ సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కంగారు అతడు అస్వస్థతకు కూడా గురయ్యాడు. 

 ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న మున్నాలాల్ ఆ తరువాత నార్త్ సెంట్రల్ రైల్వేకు 2017 నవంబర్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో ఫిర్యాదు చేసి, పరిహారం కోరాడు. కానీ అటునుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో చివరకు లాయర్ ద్వారా నోటీసులు పంపించాడు. దీంతో, ఐదు నెలలకు రైల్వే నుంచి సమాధానం వచ్చినా అతడు ఆశించిన స్పందన మాత్రం కరవైంది. అతడి సమస్యను సమస్యగా గుర్తించేందుకే రైల్వే నిరాకరించింది. 

ఇలా అయితే కుదరదని నిర్ధారించుకున్న మున్నాలాల్ చివరకు 2018 సెప్టెంబర్‌లో ఆగ్రా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్‌ ను ఆశ్రయించాడు. ఇక్కడ కూడా రైల్వే తన పాత ధోరణిని కొనసాగించింది. ఈ కేసును రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌కు బదిలీ చేయాలని వాదించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల సాయంతో మున్నాలాల్ రైల్వే ప్రయత్నాలను వమ్ము చేశాడు. చివరకు విజయం సాధించాడు. 

కోర్టు తాజాగా మున్నాలాల్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అతడికి రూ.440తో పాటూ దానిపై 7 శాతం వార్షిక వడ్డీని అదనంగా చెల్లించాలని నార్త్‌ సెంట్రల్ రైల్వేను ఆదేశించింది. బాధితుడికి కలిగిన ఆర్థిక, మానసిక ఇబ్బందులకు పరిహారంగా మరో రూ.8000, లీగల్ ఖర్చులూ చెల్లించాలని స్పష్టం చేసింది. డబ్బు చెల్లింపులో 45 రోజులకు మించి జాప్యం జరిగితే వడ్డీ 9 శాతం చెల్లించాల్సి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చింది. 

ఈ విజయంపై మున్నాలాల్ హర్షం వ్యక్తం చేశాడు. తన పోరాటం సగటు వినియోగదారుడి హక్కుల కోసమేనని వ్యాఖ్యానించాడు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించకపోతే ఇది మరింత అవినీతి, అన్యాయాలకు దారి తీస్తుందని చెప్పాడు. ఇదో సుదీర్ఘ న్యాయపోరాటమని, అయితే విజయం దక్కడంతో తన లక్ష్యం నెరవేరిందని తెలిపాడు.

More Telugu News