England: వరల్డ్ కప్ ఘోర వైఫల్యం తర్వాత... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం

  • వన్డే ప్రపంచకప్ లో దారుణంగా ఓడిపోయిన ఇంగ్లండ్ 
  • వచ్చే నెల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు
  • సీనియర్లను పక్కన పెట్టి యువతకు పెద్ద పీట వేసిన సెలెక్టర్లు
England Cricket Board crucial decision after world cup disaster

వన్డే వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టు తన దారుణమైన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో బలంగా కనిపించిన జట్టు వరుస ఓటములతో పసికూనల కన్నా దారుణంగా ఆడింది. లీగ్ దశలో 9 మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి 6 గేమ్ లలో ఓటమిపాలయింది. తద్వారా టోర్నీ నుంచి ఘోర పరాభవంతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 

వచ్చే నెల వెస్టిండీస్ పర్యటనకు ఇంగ్లండ్ జట్టు వెళ్లనుంది. ఈ టూర్ కు సీనియర్లను పక్కన పెట్టిన సెలెక్టర్లు... యువతకు పెద్ద పీట వేశారు. జానీ బెయిర్ స్టో, జో రూట్, డేవిడ్ మలన్ వంటి సీనియర్లపై వేటు వేసింది. మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్న బెన్ స్టోక్స్ ను కూడా జట్టు నుంచి తప్పించింది. మరో 7 నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో, విండీస్ సిరీస్ కు యువ క్రికెటర్లకు అవకాశం కల్పించింది. జోస్ బట్లర్ కెప్టెన్సీలో వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. 

వన్డే జట్టు: జోస్ బ‌ట్ల‌ర్ (కెప్టెన్), జాక్ క్రాలే, సామ్ క‌ర‌న్, బెన్ డ‌కెట్, టామ్ హ‌ర్ట్లే, విల్ జాక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్‌ స్టోన్, ఓలీ పోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ ట‌ర్న‌ర్, బ్రాడ‌న్ క‌ర్సే, రెహాన్ అహ్మ‌ద్‌, గ‌స్ అట్కిన్స‌న్. 

టీ20 జట్టు: జోస్ బ‌ట్ల‌ర్ (కెప్టెన్), రెహాన్ అహ్మ‌ద్, మొయిన్ అలీ, అట్కిన్స‌న్, హ్యారీ బ్రూక్, సామ్ క‌ర‌న్‌, బెన్ ట‌కెట్, విల్ జాక్స్, లివింగ్‌ స్టోన్, టైమ‌ల్ మిల్స్, ఆదిల్ ర‌షీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీసే టాప్లే, జాన్ ట‌ర్న‌ర్, క్రిస్ వోక్స్.

More Telugu News