Niharika Konidela: సినీ నిర్మాతగా మారిన నిహారిక కొణిదెల... తొలి చిత్రం ప్రారంభం

  • ఇప్పటివరకు షార్ట్ ఫిలింలు, వెబ్ సిరీస్ లు తీసిన నిహారిక
  • తాజాగా ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం
  • హైదరాబాదులో పూజా కార్యక్రమాలు
Mega daughter Niharika Konidela turns cine producer

మెగా డాటర్ నిహారిక కొణిదెల సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. 

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక సోదరుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. 

ఈ సందర్భంగా... నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాం. తొలి సారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. తెలియని టెన్షన్‌గానూ ఉంది. యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి టీమ్‌, కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం’’ అన్నారు.  

చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకు పింక్ ఎలిఫెంట్ కాన్సెప్ట్ బేస్డ్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. కొత్తవాళ్లతో ఈ బ్యానర్ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు,  నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. 

కాగా, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ ‘‘సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ చిత్రంతో మారుతున్నాను. పాటలు ఆల్ రెడీ కంపోజ్ చేస్తున్నాను. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిహారికగారికి థాంక్స్. మా డైరెక్టర్ యదు వంశీగారు ఎక్స్‌ట్రార్డినరీ స్క్రిప్ట్‌ను అందించారు. నేను ఇప్పటి వరకు అలాంటి నెరేషన్ వినలేదు. మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉంది. డైరెక్టర్ వంశీకి, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్’’ అన్నారు.

More Telugu News