Chandrababu: ఫైబర్ నెట్ కేసు: సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ డిసెంబరు 1కి వాయిదా

  • చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు
  • ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ
  • నేడు విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం
  • అటు, హైకోర్టులో కిలారు రాజేశ్ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ
ACB Court adjourns hearing on CID PT Warrant

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ సెప్టెంబరులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలు అతిక్రమిస్తూ టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. కాగా, సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. నవంబరు 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, తదుపరి విచారణను ఏసీబీ న్యాయస్థానం డిసెంబరు 1కి వాయిదా వేసింది. 

విచారణ సందర్భంగా పీటీ వారెంట్ పై సీఐడీ తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. ఇదే కేసులో టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులు అటాచ్ చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా ఏసీబీ కోర్టు విచారించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. 


కిలారు రాజేశ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

స్కిల్ కేసులో నారా లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ కు సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని కిలారు రాజేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. 

రాజేశ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు.... 161, 91 సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్ఓసీ నోటీసుల్లో రాజేశ్ ను నిందితుడిగా పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... తాము రాజేశ్ ను నిందితుడిగా పేర్కొనలేదని, ఎల్ఓసీ పొరపాటున ఇచ్చామని తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న అనంతరం ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.

More Telugu News