PAN Cards: 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసిన కేంద్రం... ఎందుకంటే...!

  • పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని చెబుతున్న కేంద్రం
  • ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగింపు
  • జూన్ 30తో ముగిసిన గడువు
Center takes action on PAN Cards which are not linked to AADHAR

పాన్ కార్డులను ఆధార్ తో లింకు చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతోంది. ఆ మేరకు పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. పొడిగించిన గడువు కూడా ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో, 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం కానట్టు కేంద్రం గుర్తించింది. వాటిలో 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. 

మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) నుంచి వివరణ కోరారు. చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సీబీడీటీ సమాధానమిచ్చింది. 

నిర్ణీత గడువు లోపు ఆధార్ తో అనుసంధానం చేయని 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. దేశంలో పాన్ కార్డులు కలిగి ఉన్న వారి సంఖ్య 70.24 కోట్ల మంది అని, అందులో 57.25 కోట్ల మంది ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్నారని వివరించింది. 

ప్రస్తుతం పాన్ కార్డు దరఖాస్తు సమయంలోనే ఆధార్ లింక్ చేస్తారు. 2017 జులై 1వ తేదీకి ముందు పాన్ కార్డు పొందిన వారికి ఆ సౌలభ్యం లేదు. వారు తమ పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.

More Telugu News