Sharat Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’లో మోహన్ బాబు, శరత్ కుమార్

  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో 'కన్నప్ప'
  • ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో చిత్రం
  • కన్నప్పలో తన పాత్రతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేయనున్న శరత్ కుమార్
  • మరో కీలక పాత్రలో మోహన్ బాబు
  • 'కన్నప్ప'పై మరింత పెరిగిన అంచనాలు
Sharat Kumar and Mohan Babu on board for Kannappa movie

ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న చిత్రాలలో 'కన్నప్ప' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' మీద జాతీయ స్థాయిలో అంచనాలున్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు 'కన్నప్ప' ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, విలక్షణ నటుడు శరత్ కుమార్ కూడా వచ్చారు. 

దక్షిణాదిలో శరత్ కుమార్‌కు హీరోగా, నటుడిగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. హీరోగా, ప్రముఖ పాత్రల్లో ఎంతో విలక్షణంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న శరత్ కుమార్ ఇప్పుడు 'కన్నప్ప' చిత్రంలో నటించేందుకు సిద్దమయ్యారు. కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ వస్తున్న శరత్ కుమార్ ఈసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయబోతున్నారు. శరత్ కుమార్... బన్నీ, భరత్ అనే నేను, జయ జానకీ నాయకా, భగవంత్ కేసరి వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. 

ఇక, మోహన్ బాబు గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు శరత్ కుమార్, మోహన్ బాబు వంటి దిగ్గజాలు 'కన్నప్ప' సెట్స్ మీదకు రావడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. 

శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతని భక్తిని, ఆయన భక్తికి ఉన్న శక్తిని ఇప్పటికీ అందరూ తలుచుకుంటారు. శ్రీకాళహస్తిలోని గుడిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

'మహాభారతం' సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ 'కన్నప్ప' చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచేట్టు రూపొందిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, కథను చెప్పే విధానం, మేకింగ్ తీరు ఇలా అన్నీ కూడా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

More Telugu News