Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

  • వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మంలోని నివాసంలో తనిఖీలు
  • ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నివాసంలోనూ సోదాలు
  • 8 వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్న అధికారులు
IT and ED searches at Congress leader Ponguleti Srinivas Reddys residence

కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది. ఐటీ, ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు. గురువారం వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. మొదట సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 

ఇదిలావుండగా ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తన కుటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు. రోజుల వ్యవధిలో ఇది చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా గురువారం ఆయన నామినేషన్ వేయాలని భావించారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది వేచిచూడాలి.

More Telugu News