Atchannaidu: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి అచ్చెన్నాయుడు, సీనియర్ నేతల ఫిర్యాదు

  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడం లేదని ఆరోపణ
  • ప్రతిపక్షాలు, ప్రజల విజ్ఞప్తుల్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నారని ఆగ్రహం
  • అధికారపార్టీ అండతో తప్పులు చేస్తున్న ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Atchannaidu complains to EC over electoral list issues

ప్రజలు తమపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పసిగట్టిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపిందని, దొంగఓట్లు సృష్టించడం, అర్హుల ఓట్లు తొలగించడమనే తంతును నిరంతరం కొనసాగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రత్యేకంగా దొంగఓట్ల కోసమే జగన్ రెడ్డి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసినట్టు కనిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంఏ.షరీఫ్, వర్ల రామయ్య, పరుచూరి అశోక్ బాబు, పిల్లి మాణిక్యరావుతో కలిసి, రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఏపీ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. 

అచ్చెన్నాయుడు ప్రసంగం ఆయన మాటల్లో.. 

“ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయులు, కొందరు ప్రభుత్వాధికారులు ఎన్నికల వ్యవస్థలో కీలకంగా పనిచేసేవారు. కానీ జగన్ రెడ్డి ఒక దుర్భుద్ధితో వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ వ్యవస్థలు ఎన్నికల ప్రక్రియలో వేలు పెట్టడం.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం రివాజుగా మారింది. ఈ మాట మేం మాత్రమే అనడం లేదు.. అన్ని పార్టీలు, ప్రజలు అంటున్నారు. మీడియాలో వచ్చే కథనాలు కూడా ప్రజల అభిప్రాయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చెట్టుకి ఓటుహక్కు.. 
‘‘విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చెట్టుని ఓటర్ల జాబితాలో ఓటు హక్కు ఉన్న వ్యక్తిగా ఈ ప్రభుత్వం చూపించింది. ఒక్కో వ్యక్తికి మూడు, నాలుగుచోట్ల దొంగ ఓట్లు కల్పించారు. సాధారణ వ్యక్తులకే కాదు, ఏకంగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులుగా ఉన్నవారికే రెండు మూడు చోట్ల ఓట్లున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మూడు ప్రాంతాల్లో ఓట్లున్నాయి. అనిల్ కుమార్ ఎవరో ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా? ఇలాంటి అనైతిక పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం దొంగ ఓట్లతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రతిపక్షాల విజ్ఞప్తులు.. ఎన్నికల సంఘం ఆదేశాల బుట్టదాఖలు
‘‘ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో జరిగే తప్పులు.. ఓటర్ల జాబితాకు సంబంధించిన తప్పుల్ని స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు స్పందించకపోతే ఎప్పుడు వీలైతే అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలుస్తున్నాం. కానీ పై స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను జిల్లా కలెక్టర్లు బుట్టదాఖలు చేస్తున్నారు. దొంగ ఓట్లు, అర్హులైన ఓట్లు తీసేసిన దానికి సంబంధించి ఆధారాలతో సహా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నా వారు స్పందించడం లేదు.

ఓట్ల సమస్యలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే, వాటిని పరిష్కరించకుండా మరలా కొత్తగా ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 ఇతర వివరాలు అడగడం సరికాదు. కొత్త ఓటర్ల చేర్పులు, చనిపోయినవారి ఓట్లు తొలగించడం, ఓటర్ల జాబితాను సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకం. గతంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేసినప్పుడు, పైన చెప్పిన మూడు అంశాలకు సంబంధించి అధికారులు, బీఎల్వోలు ఓటర్ల నుంచి సమాచారం సేకరించారు. కానీ గతనెలలో ఎన్నికల కమిషన్ విడుదలచేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చూశాక ఆ సమాచారంపై  క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థమైంది. ఫామ్ -6 , ఫామ్-7, ఫామ్ -8 ల వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కనిపిస్తున్నాయి గానీ, ఓటర్ల జాబితా సవరణలో వాటికి సంబంధించిన మార్పు చేర్పులు కనిపించడం లేదు’’

‘‘2,09,000  ఫామ్ -6 లు దరఖాస్తు చేస్తే, ఆ వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లో నమోదయ్యాయి. కానీ క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన ఓటర్ల చేర్పుల ప్రక్రియ జరగలేదు. అలానే ఫామ్ -7ల దరఖాస్తులు 5.58లక్షలు ఇచ్చాం. ఓటర్ల జాబితాలో సవరణలు సూచిస్తూ ఫామ్-8 దరఖాస్తులు 7.16లక్షల వరకు ఎన్నికల కమిషన్‌కు అందించాం. అవన్నీ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లో కనిపిస్తున్నాయి. కానీ ఆయా దరఖాస్తు సమాచారాన్ని అధికారాలు పరిగణనలోకి తీసుకోలేదని డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చూశాక అర్థమైంది. తాము ఇచ్చిన దరఖాస్తులపై అధికారుల నుంచి ఎలాంటి స్పందనాలేదు. పరిగణనలోకి తీసుకున్నామనో లేదనో లేదా ఇతర కారణాలో ఏమీ చెప్పలేదు? గతంలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కరించకుండా మరలా కొత్తగా ఇంటింటికీ వెళ్లి ఫామ్-6, ఫామ్-7, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫామ్-6, ఫామ్-7 వంటి దరఖాస్తులన్నీ కలిపి ఇప్పటికే 11లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా మరలా వివరాలు అడగడం సరికాదని కూడా చెప్పాం’’ 

‘‘చాలా చోట్ల ఒకే ఇంటిలో ఉండేవారు, ముఖ్యంగా భార్యాభర్తల ఓట్లను కూడా వేర్వేరు పోలింగ్ బూత్‌లకు మార్చారు. అవన్నీ ఒకే బూత్‌లో ఉండేలా చూడాలని మేం కోరితే, దానిపై అధికారులు ఎలాంటి కసరత్తు చేయలేదు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లో ప్రతి బూత్, ప్రతి వార్డ్, ప్రతి పోలింగ్ కేంద్రం వివరాల ఉండాలి. అలానే బూత్‌లలోని ఓట్ల వివరాలు ఉండాలి. ఆ వివరాలు ఏవీ సక్రమంగా లేవు. రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు మొత్తం బూత్‌లవారీగా వెబ్‌సైట్లో ఉంచాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరాం. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో సర్వీస్ ఓట్లకు సంబంధించిన సమాచారం కూడా లేదని, దాన్ని కూడా చేర్చాలని చెప్పాం’’ 

‘‘దొంగఓట్ల నమోదు, అర్హుల ఓట్లు తొలగింపు, ఓటర్ల జాబితాలో తప్పులు చేస్తున్న కిందిస్థాయి అధికారులు, వారికి సహకరిస్తున్న కలెక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ని కోరాం. నియోజకవర్గాల వారీగా పోలైన దొంగఓట్లు, అర్హుల ఓట్ల తొలగింపు వివరాలను కూడా ఎన్నికల కమిషన్ ముందు ఉంచాం. కానీ క్షేత్రస్థాయిలో తప్పుచేసిన అధికారులు, ఇతరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు 18 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు సరిగా లేవు. స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే పోలింగ్ కేంద్రాలు మార్చడం లేదు. దానిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పాం.  మొక్కుబడిగా ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదని, సీరియస్‌గా వ్యవహరించాలని ఎన్నికల ప్రధానాధికారాని కోరాం. మా విజ్ఞప్తులపై ఆయన స్పందించారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ ఒక్కరోజే 13లేఖలు అందించాం. గతంలో కూడా పలుమార్లు అనేక ఫిర్యాదులు చేశాం. ఇదే విషయం ఎన్నికల కమిషనర్‌తో కూడా చెప్పాం. మేం ఫిర్యాదులు ఇవ్వడం. మీరు వాటిపై కిందిస్థాయి అధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం చేస్తున్నారు గానీ పరిస్థితి ఏమీ మారడంలేదని చెప్పాం. అధికారులు మీ ఆదేశాలను పట్టించుకోవడం లేదని చెప్పాం. వైసీపీనేతల కనుసన్నల్లోనే అధికారులు, కొందరు కలెక్టర్లు పనిచేస్తున్నారని నిర్మొహమాటంగా చెప్పాం. మేం చెప్పిన దానిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ చెప్పారు’’ 

ఏపీ ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులు, వివరాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం
ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుంచిన అన్ని వివరాలను, ఫిర్యాదుల్ని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ముందు కూడా ఉంచుతాం. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు, దొంగఓట్ల వ్యవహారం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతర అంశాలపై  త్వరలోనే టీడీపీ ఎంపీలతో కలిసి సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగాలన్నదే టీడీపీ అభిమతం.  ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో ఎందరు అధికారులపై, ఇతర సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పోలీస్ శాఖ నుంచి వివరాలు తీసుకోవాలని చెప్పాం. దానికి ఎన్నికల కమిషనర్ కూడా సరేనన్నారు. వైసీపీలోని పెద్దపెద్ద నాయకులే సిగ్గులేకుండా దొంగఓట్లు చేర్పిస్తున్నారు. బూత్‌లవారీగా త్వరలోనే ఆ సమాచారం కూడా ఎన్ని కల కమిషన్ ముందు ఉంచుతాం” అని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. 

అధికారుల్ని ప్రశ్నిస్తుంటే వెటకారంగా మాట్లాడుతున్నారు: బొండా ఉమామహేశ్వరరావు

దొంగఓట్లు ఎందుకు తొలగించరు, అర్హులకు ఎందుకు ఓటు హక్కు కల్పించరని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. “ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ అనేది రాష్ట్రంలో అపహాస్యంగా మారింది. ఆర్వోలు, కలెక్టర్లు చుట్టూ తిరగడమే ప్రతిపక్షాలపని అయిపోయింది. కలెక్టర్లు, కిందిస్థాయి సిబ్బంది ఫామ్-7 దరఖాస్తుల విషయంలో తాడేపల్లి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఫామ్-7 దరఖాస్తుల విషయంలో టీడీపీ ఓట్లు తొలగించే విషయంలో అధికారులు పోటీలు పడి పనిచేస్తున్నారు. వారికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకరిస్తున్నారు. అనర్హుల ఓట్లు తీసేయమని టీడీపీ ఇచ్చే దరఖాస్తులపై మాత్రం తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు’’ 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం (నియోజకవర్గం నెం-80) లో పోలింగ్ స్టేషన్ నెం-62 లో ఒక వైసీపీ నాయకుడి తల్లిపేరుతో మూడు ఓట్లు నమోదు చేశారు. ఒకే వ్యక్తి, ఒకే ఫోటోతో ఒకే పోలింగ్ స్టేషన్లో అధికారుల ప్రమేయం లేకుండా మూడు ఓట్లు ఎలా నమోదవుతాయి? అవి ఎందుకు తీసేయరని మేం స్థానిక అధికారుల్ని ప్రశ్నిస్తే రూల్స్ ప్రకారం స్పందిస్తామని చెబుతున్నారు. అవే రూల్స్, ఇతర నిబంధనలు దొంగఓట్లు తీసేయడంలో ఎందుకు చూపించరని ప్రశ్నిస్తున్నాం. నగరపాలక అధికారులు, మున్సిపల్ అధికారుల వద్ద పౌరుల జననమరణాల వివరాలు ఉంటాయి. వాటి ప్రకారం ఎవరు చనిపోయారో ఓట్లు తొలగించేముందు అధికారులు ఎందుకు పరిశీలించరని ప్రశ్నిస్తున్నాం. మరీ దారుణంగా విజయవాడ సెంట్రల్  నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్-44లో ఒక చెట్టుని ఓటరుగా చూపారు. అధికార పార్టీకి నచ్చితే చెట్టుకు పుట్టకు ఆఖరికి చెప్పులకు కూడా ఓట్ల పుట్టిస్తారు. టీడీపీ వాళ్లు దొంగఓట్లు తీసేయమంటే నిబంధనలు అంటున్న అధికారులకు ఇలాంటి వింతలు కనిపించడం లేదా?’’ 

‘‘అధికారులు, కొందరు కిందిస్థాయి సిబ్బంది పనితీరుతో ఇంతకు ముందు జరిగిన ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన అంతా ఫార్స్‌గా మారింది. 2019 ఎన్నికల్లో 25 ఓట్లతో ఓడిపోయాను. ఇప్పుడు నా నియోజకవర్గంలో 12000 దొంగఓట్లు చేర్చారు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోరని అధికారుల్ని ప్రశ్నిస్తుంటే, వెటకారంగా సమాధా నమిస్తున్నారు. ఆధారాలు చూపిస్తున్నా, పట్టించుకోని వారిని ఏంచేయాలో మీరే ఆలోచించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించాం. ఈ ప్రభుత్వ కుట్రలు.. కుతంత్రాలను అమలుకానివ్వం. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఓటు హక్కు విని యోగించుకోవాలి..అలానే దొంగఓటు ఒక్కటీ పడకూడదన్నదే టీడీపీ లక్ష్యం. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి అధికారుల్ని అడ్డుపెట్టుకొని ఓటర్ల జాబితాలో ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నాడు” అని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News