Chhattisgarh: ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో కొనసాగుతున్న పోలింగ్.. తరలివస్తున్న ఓటర్లు

  • మిజోరంలో ఒకే దశలో 40 స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్
  • ఛత్తీస్‌గఢ్‌‌లో మొదటి దశలో 20 నియోజకవర్గాలకు పోలింగ్
  • నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య ఎన్నికలు
Chhattisgarh and Mizoram Voting today

ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895గా ఉంది. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, 1 ట్రాన్స్‌జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.

నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు చేరుకుంటున్నారు. తొలిదశలో భాగంగా 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పెద్ద సంఖ్యలో పోలీసు, ప్రత్యేక బలగాలను మోహరించింది. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కొనసాగుతున్న 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఒక్క బస్తర్ జిల్లాలో ఏకంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు.

More Telugu News