Cricket: న్యూజిలాండ్‌పై పాక్ గెలుపుతో మారిపోయిన సెమీస్ సమీకరణాలు.. పాక్‌కు మెండుగా ఛాన్స్!

  • 8 పాయింట్లతో కివీస్‌తో సమానంగా నిలిచిన పాక్
  • తక్కువ నెట్ రన్ రేటు కారణంగా 5వ స్థానానికి పరిమితమైన దాయాది
  • చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలిస్తే సెమీస్ చేరే ఛాన్స్
Where Win Against New Zealand Leaves Pakistan In Top 4 Race

వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ ఫఖర్ జమాన్ సూపర్ సెంచరీ, కెప్టెన్ బాబర్ అర్ధ సెంచరీకి తోడు వరుణుడు కూడా పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిచినట్టు  డీఎల్ఎస్ పద్ధతిలో తేల్చారు. ఈ గెలుపుతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది. 

ఈ గెలుపుతో పాకిస్థాన్ ఖాతాలో 8 పాయింట్లు చేరాయి. పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సరిసమానంగా నిలిచింది. ఇరు జట్లకు సమానమైన పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు తక్కువగా ఉండడంతో పాకిస్థాన్ 5వ స్థానానికి పరిమితమైంది. ఈ రెండు జట్లకు కేవలం ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. చివరి మ్యాచ్‌లో పాక్ ఇంగ్లండ్‌తో, న్యూజిలాండ్ శ్రీలంకతో తలపడబోతున్నాయి. ఒకవేళ ఇంగ్లండ్‌పై పాక్ గెలిచి, శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాకాకుండా తమ చివరి మ్యాచ్‌ల్లో ఇరు జట్లు విజయం సాధిస్తే  నెట్ రన్‌రేట్ ఆధారంగా ఎవరు సెమీస్ చేరతారనేది తేలనుంది. 

సెమీ ఫైనల్ అవకాశాలు మెండుగా ఉన్న జట్లలో ఆఫ్ఘనిస్థాన్ కూడా ఉంది. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో బలమైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లను ఆప్ఘనిస్థాన్ ఢీకొట్టబోతోంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే నాకౌట్‌కు చేరుకోవడం ఖాయం. అయితే ఒకే మ్యాచ్‌లో గెలిస్తే సమీకరణం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ ఖాతాల్లో కూడా 10 పాయింట్లు ఉంటే అగ్రస్థానంలో ఎవరు ఉంటారనేది నెట్ రన్ రేటు ఆధారంగా తేల్చనున్నారు. ఇక వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. ఇంగ్లండ్‌పై విజయంతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నాయి.

More Telugu News