Hamas: ఇజ్రాయెల్ పై మళ్లీ మళ్లీ దాడులు చేస్తాం.. టీవీ ఇంటర్వ్యూలో హమాస్ లీడర్.. వీడియో ఇదిగో!

  • శత్రువుకు గుణపాఠం చెప్పితీరతామన్న హమాస్ ప్రతినిధి ఘాజి హమాద్
  • ఈ విషయం చెప్పడానికి తాము సిగ్గుపడట్లేదని వెల్లడి
  • ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని వివరణ
Will attack Israel again and again say Hamas leader

ఇజ్రాయెల్ పై మళ్లీ మళ్లీ దాడులు చేసితీరతామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ స్పష్టం చేశారు. ఆ దేశానికి తగిన గుణపాఠం నేర్పిస్తామని, సమూలంగా నాశనం చేసే వరకూ దాడులు ఆపబోమని వివరించారు. పాలస్తీనా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామని, అప్పటి వరకూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. అరబ్ దేశాలకు, ముస్లిం దేశాలకు ముప్పుగా తయారైన ఇజ్రాయెల్ ను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఈమేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో ఘాజి హమాద్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ను ప్రపంచ పటంలో నుంచి తొలగించాల్సిందేనని చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి మూల్యం చెల్లించుకోవడానికి హమాస్ సిద్ధమేనని తెలిపారు. సామాన్య పౌరులకు హాని చేయడం హమాస్ లక్ష్యం కాదని ఈ సందర్భంగా హమాద్ స్పష్టతనిచ్చారు. అయితే, గ్రౌండ్ అటాక్ లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. అమరవీరుల దేశంగా పాలస్తీనా పేరొందిందని, దేశం కోసం అమరులయ్యేందుకు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారని హమాద్ చెప్పారు.

ప్రస్తుతం ఇజ్రాయెల్ పై జరిపిన దాడి (ఆల్ అక్సా ఫ్లడ్) ప్రారంభం మాత్రమేనని, ఇకపైనా దాడులు కొనసాగిస్తామని వివరించారు. రెండు, మూడు, నాలుగు.. ఇలా దాడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు జరిపిన దారుణ ఊచకోతపైనా, ఈ ఘటనలో సామాన్యుల మరణాలపైనా స్పందించాలని టీవీ యాంకర్ పదే పదే ప్రశ్నించింది. దీంతో ఇంటర్వ్యూ మధ్యలోనే హమాద్ లేచి వెళ్లిపోయారు.

More Telugu News