Rahul Gandhi: ప్రజల తెలంగాణ... దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు: రాహుల్ గాంధీ

  • తన సోదరి ప్రియాంక గాంధీకి అనారోగ్యం దృష్ట్యా తాను వచ్చానన్న రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్‌ది రాజకీయ అనుబంధం కాదని... కుటుంబ అనుబంధమన్న రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని హామీ
Rahul gandhi says election between people telangana and dorala telangana

ప్రజల తెలంగాణ... దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన సోదరి ప్రియాంక గాంధీ అనారోగ్యం దృష్ట్యా తాను వచ్చానని చెప్పారు. మనది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధమన్నారు. పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదన్నారు. పైగా తమ ప్రభుత్వం వస్తే రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. టిక్కెట్ల విషయంలో ఢిల్లీలో సీఈసీ భేటీ ఉన్నప్పటికీ తాను ఈ సభకు వచ్చానన్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ సొమ్మును దోచేశారన్నారు. లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారన్నారు.

More Telugu News