tdp: బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు

  • స్కిల్ కేసులో నాలుగు వారాల బెయిల్ ఇచ్చిన కోర్టు
  • మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • 52 రోజుల పాటు జైలులో ఉన్న టీడీపీ చీఫ్
  • నేటి సాయంత్రం లేదా రేపు ఉదయం బయటకు రానున్న చంద్రబాబు
  • బెయిల్ షరతులపై ప్రస్తుతానికి స్పష్టత లేదంటున్న న్యాయవాదులు

chandrababu gets bail

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. టీడీపీ అధినేత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టేసిన కోర్టు.. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వచ్చే నెల 28 వరకు బెయిల్..
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. మెడికల్ గ్రౌండ్స్ పై చంద్రబాబుకు వచ్చే నెల 28 వరకు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ కు సంబంధించి కోర్టు ఎలాంటి షరతులు విధించిందనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. బెయిల్ కు సంబంధించిన తీర్పు కాపీ వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. కాగా, ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది.

సెప్టెంబర్ 9 న చంద్రబాబు అరెస్టు..
స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ చీఫ్ చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 10 నుంచి 52 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. అయితే, కొన్ని రోజులుగా చంద్రబాబు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని కోర్టు వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News