Tech-News: కొత్త ల్యాప్‌టాప్‌లు ఆవిష్కరించిన యాపిల్.. బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే..!

  • ఐమ్యాక్, థర్డ్ జనరేషన్ ‘మ్యాక్ ప్రాసెసర్’ విడుదల
  • మరింత మెరుగైన పనితీరుతో వచ్చిన ఉత్పత్తులు
  • ‘స్కేరీ ఫాస్ట్’ ఈవెంట్‌లో భాగంగా ఆవిష్కరించిన కంపెనీ
Apple Unveils New Laptops and iMac And Trio Of More Powerful Chips

యాపిల్ కంపెనీ సోమవారం కొత్త ఐమ్యాక్, ల్యాప్‌టాప్‌లతోపాటు థర్డ్ జనరేషన్ ‘మ్యాక్ ప్రాసెసర్’ని ఆవిష్కరించింది. మెరుగైన ఫెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ హార్స్‌పవర్‌‌తో ఎం3 చిప్‌ని అందించినట్టు తెలిపింది. కొత్త చిప్ లైనప్ అధునాతన 3-నానోమీటర్ తయారీ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుందని, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రదర్శనలో వివరాలు వెల్లడించింది. బేస్ మోడల్‌లో ఎనిమిది ప్రధాన కోర్స్(చిప్‌లోని ప్రాసెసింగ్ ఇంజన్లు), గ్రాఫిక్స్ కోసం అదనంగా 10 కోర్స్ ఉంటాయని తెలిపింది.  

బ్రాండెడ్ ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ‘స్కేరీ ఫాస్ట్’లో భాగంగా వీటిని విడుదల చేసినట్టు తెలిపింది. కాలిఫోర్నియా కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైందని వివరించింది. కాగా కొత్తగా ఆవిష్కరించిన కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ కొత్త ప్రాసెసర్‌లతో వచ్చాయి. 22 గంటల బ్యాటరీ సామర్థ్యంతో మరింత శక్తిమంతంగా పనిచేస్తాయని యాపిల్ తెలిపింది. 24 అంగుళాల ఆల్ ఇన్ వన్ ఐమ్యాక్ వెర్షన్‌ను కూడా యాపిల్ ఆవిష్కరించింది. ఇది ఎం3తో పనిచేయనుందని వివరించింది. మరింత మెరుగైన పనితీరు లక్ష్యంగా ఎం3లో 2 శ్రేణులు ప్రో, మాక్స్ వెర్షన్లు ఉన్నాయని వెల్లడించింది. కాగా యాపిల్ ప్రకటనతో కంప్యూటర్ ప్రాసెసర్ వ్యాపారం మెరుగయ్యే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

More Telugu News