Nara Lokesh: రైతులు అల్లాడుతున్నారు... ఆదుకోండి: ఏపీ సీఎం జగన్ కు నారా లోకేశ్ బహిరంగ లేఖ

  • రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న లోకేశ్
  • ఎండిన పంటలు చూస్తే గుండె బరువెక్కుతోందని వ్యాఖ్య 
  • రైతులు పంటల్ని తగలబెడుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని వ్యాఖ్యలు
Nara Lokesh open letter to CM Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తో అల్లాడుతోన్న రైతాంగాన్ని త‌క్షణ‌మే ఆదుకోవాలని స్పష్టం చేశారు. నీరు లేక ఎండిన పంట‌లు చూస్తే గుండె త‌రుక్కుపోతోందని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మరో మార్గం లేక పంట‌ల్ని రైతులు త‌గ‌ల‌బెడుతుంటే క‌ళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని వెల్లడించారు. వ‌రి వేసిన పొలాల్లో ఉరి వేసుకుంటోన్న రైతుల్ని చూస్తే హృద‌యం ద్రవించిపోతోందని పేర్కొన్నారు. 

"నీరు వ‌దిలి పంట‌ల్ని కాపాడాలంటూ అధికారుల కాళ్లపై ప‌డి ప్రాధేయప‌డుతున్న అన్నదాత‌లు, సాగు నీటి కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులే రాష్ట్రమంతా క‌నిపిస్తున్నారు.  ప్రభుత్వం త‌క్షణ‌మే స్పందించ‌క‌పోతే ఆంధ్రప్రదేశ్‌ రైతుల్లేని రాష్ట్రం అయ్యే ప్రమాదం పొంచి వుంది. 

రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు ఎన్నడూ లేవు. తొలిసారి అతి తక్కువ వర్షపాతం మీ పాలనలో నమోదైంది. రైతు ఆత్మహ‌త్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో  మీ ప్రభుత్వం విఫలమైంది. 

ఖరీఫ్ పంటలే నీటికి కటకటలాడుతుంటే, రబీ సాగు ప్రశ్నార్థకమే. కొన్ని ప్రాజెక్టులలో నీటి నిల్వ లేదు, మరికొన్ని ప్రాజెక్టుల్లో నీరున్నా... పంటలు ఎండిపోతున్నా వ‌ద‌ల‌రు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్ని ప్రజలకి వివరించేందుకు వ‌చ్చిన చంద్రబాబు గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలులో బంధించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆయ‌న‌ని జైలులో నిర్బంధించే కుట్రల‌పై స‌మీక్షించే స‌మ‌యం ఉంది కానీ, క‌రవుపై సమీక్షించే తీరిక లేని సీఎం ఉండడం ప్రజల దురదృష్టం. 

పెన్నా, తుంగభద్ర కాలువల కింద, కృష్ణా డెల్టాలోనూ సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ పూర్తిగా దెబ్బతిన్నాయి. బోర్లు, బావుల నుంచి నీరందించి పంటలు కాపాడుకుందామంటే కరెంటు కోతలతో సాధ్యం కావడంలేదు. 

రైతులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. యుద్ధప్రాతిప‌దిక‌న‌ కరవు మండలాలని గుర్తించి కేంద్రానికి నివేదిక పంపాలి. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలి. పంట‌ నష్టం అంచనా వేసి రైతుల‌కు నష్ట పరిహారం తక్షణమే అందించాలి" అని డిమాండ్ చేశారు.

More Telugu News