kotha prabhakar reddy: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. యశోద ఆసుపత్రికి తరలింపు

  • సూరంపల్లిలో ఎంపీ ప్రచారం నిర్వహిస్తుండగా రాజు అనే వ్యక్తి కత్తితో దాడి 
  • కడుపు భాగంలో కత్తితో దాడి చేయడంతో ఆసుపత్రికి తరలింపు
  • రాజును పట్టుకొని చితకబాదిన బీఆర్ఎస్ కార్యకర్తలు
  • పోలీసుల అదుపులో నిందితుడు  
Unknown person attack mp kotha prabhakar reddy with knife

మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సమయంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు, దాడి అనంతరం ఎంపీ కొత్తను ఆయన వాహనంలోనే గజ్వేల్‌కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు సమాచారం రావడంతో హుటాహుటిన బయలుదేరారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

కాగా రాజు కరచాలనం చేసేందుకు వచ్చి కత్తితో దాడి చేశాడు. నిందితుడిని మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌లో విలేకరిగా పని చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

More Telugu News