PJR: బీఆర్ఎస్ లోకి విష్ణువర్ధన్ రెడ్డి?.. పీజేఆర్ కొడుకుతో హరీశ్ రావు భేటీ

  • పార్టీలోకి ఆహ్వానించినట్లు వెల్లడించిన హరీశ్ రావు
  • విష్ణు ఒప్పుకున్నారని మీడియా సమావేశంలో ప్రకటన
  • కాంగ్రెస్ పార్టీ ముఠా కోరుల చేతుల్లోకి వెళ్లిందన్న మంత్రి
Telangana Minister Harish Rao meets P Vishnuvardhan Reddy

జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండడని, కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన ప్రజాసేవ అందరికీ తెలిసిందేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అలాంటి నేత వారసుడికి కాంగ్రెస్ పార్టీ నేడు తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్నట్లు ఉండేదని చెప్పారు. సీఎల్పీ నేతగా పీజేఆర్ ఆ పార్టీకి ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు కొంతమంది ముఠాకోరుల చేతుల్లోకి వెళ్లిందని, పార్టీ కోసం కష్టపడుతున్న నేతలకు కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారని వివరించారు. వారిని బీఆర్ఎస్ పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించేందుకే నేడు విష్ణువర్ధన్ ఇంటికి వచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ లో చేరేందుకు విష్ణు అంగీకరించారని, త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని పేర్కొన్నారు. నాగం జనార్దన్, విష్ణులకు బీఆర్ఎస్ లో గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తర్వాత విష్ణు అధికార పార్టీలో చేరతారని సమాచారం.

More Telugu News