Bandi Sanjay: అన్ని పార్టీల టార్గెట్ బీజేపీనే: బండి సంజయ్

  • కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్
  • కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎప్పుడూ కలిసే ఉంటాయని వెల్లడి
  • కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్ పై ఆధారపడి ఉందని వ్యాఖ్యలు
  • అందుకే కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారని వ్యంగ్యం
Bandi Sanjay says all parties targets BJP

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు బీజేపీనే టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. తమపై విమర్శల దాడి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ కలిసే ఉంటాయని, ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం పెట్టడమే అందుకు నిదర్శనమని బండి సంజయ్ వివరించారు. 

కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్ పై ఆధారపడి ఉందని, దాంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొందని ఎద్దేవా చేశారు. అసలు, డిపాజిట్లే రాని కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలది రాజకీయ అక్రమ సంబంధం అని ఘాటు విమర్శలు చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతోందని వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News