Pakistan: దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన పాకిస్థాన్... బాబర్ సేనకు అగ్నిపరీక్ష

  • వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే పాక్ కు గెలుపు తప్పనిసరి
  • నాలుగో సెమీస్ బెర్తు కోసం విపరీతమైన పోటీ
Pakistan face off with South Africa in a crucial match

వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల ఫామ్ రీత్యా వాటికి సెమీస్ బెర్తులు దాదాపు ఖాయమే. అయితే నాలుగో సెమీస్ బెర్తు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు మాత్రమే సాధించిన పాకిస్థాన్ కు నేటి మ్యాచ్ లో గెలవడం అత్యంత అవసరం. 

ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైన పాక్ ఇవాళ్టి మ్యాచ్ లో కూడా ఓడిపోతే సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి. దాంతో సఫారీలతో బాబర్ అజామ్ సేన చావోరేవో పోరుకు సిద్ధమైంది. 

ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అనారోగ్యానికి గురైన పేసర్ హసన్ అలీ స్థానంలో వసీమ్ జూనియర్ కు తుదిజట్టులో స్థానం కల్పించారు. ఉసామా మిర్ స్థానంలో నవాజ్ ను తీసుకున్నారు. 

అటు, దక్షిణాఫ్రికా జట్టులో మూడు మార్పులు జరిగాయి. కెప్టెన్ టెంబా బవుమా తిరిగి జట్టులో చేరాడు. రీజా హెండ్రిక్స్, రబాడా, లిజాద్ విలియమ్స్ లకు తుది జట్టులో స్థానం లభించలేదు. లుంగీ ఎంగిడి, తబ్రైజ్ షంసీలను జట్టులోకి తీసుకున్నారు.

More Telugu News