Nara Bhuvaneswari: పవన్ కల్యాణ్ "బాగున్నారా అమ్మా" అని ఆప్యాయంగా అడిగారు: నారా భువనేశ్వరి

  • 'నిజం గెలవాలి' యాత్రకు నేడు రెండో రోజు
  • తిరుపతి 'అంకుర' ఆసుపత్రి పక్కన నారా భువనేశ్వరి సభ
  • మహిళలతో ముఖాముఖి
  • మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన చంద్రబాబు అర్ధాంగి
Nara Bhuvaneswari recalls Pawan Kalyan affectionate words

‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం భువనేశ్వరి ప్రసంగించారు.
"మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్వామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని... కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం (భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్) నాలుగు దిక్కులయ్యాం. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయింది. మనవడు దేవాన్ష్ ను చూసి 48 రోజులు అయింది" అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

కాగా, ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు వచ్చిన మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

వంగలపూడి అనిత:  చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ల ద్వారా 2019లోనూ ఏపీ ప్రభుత్వం అవార్డు అందుకుంది. 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో అవినీతి జరిగిందని చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు?


భువనేశ్వరి: తప్పుడు కేసులు పెట్టి టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు. రూ.371 కోట్లు అవినీతి అంటున్నారు. అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో చెప్పడం లేదు. 48 రోజులుగా చంద్రబాబును నిర్బంధించారు. ఇలా ఇబ్బందులకు గురి చేస్తే పెట్టుబడిదారులెవరూ రాష్ట్రానికి రారు... పరిశ్రమలు పెట్టరు. సీఐడీ అధికారులు విచారణ చేసుకోండి... ఇలాంటి వాటికి టీడీపీ బెదరదు. పార్టీ సభ్యత్వానికి కార్యకర్తలు రూ.100 ఇస్తే దానిపైనా విచారణ చేస్తామంటున్నారు. ప్రజల సొమ్ముకు చంద్రబాబు ఎప్పుడూ ఆశపడరు. 

రాజేశ్వరి, గూడూరు: చంద్రబాబు 45 ఏళ్ల జీవితంలో ప్రజలకు కనబడకుండా ఏ ఒక్క రోజు కూడా లేదు. కానీ ఇప్పుడు చూడక 45 రోజులైంది... చంద్రబాబు ఎలా ఉన్నారు... మాకు ఏమి చెప్పమన్నారు?

భువనేశ్వరి: చంద్రబాబు ప్రజల మనిషి. నాకంటే మీకే ఎక్కువ ఆయన గురించి తెలుసు. మాకు ములాఖత్ కు 30 నిమిషాలు సమయం ఇస్తున్నారు. 25 నిమిషాలు పార్టీ, ప్రజల గురించే అడుగుతారు. 5 నిమిషాలే మా గురించి మాట్లాడతారు. చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్. ఎవరు ఏమి చేసినా ఆయన బెదరడు. 

గిరిజ, తిరుపతి: ఎన్నికల ముందు  చంద్రబాబును అరెస్టు చేసి ఎన్నికలకు ఎళ్లాలని చూస్తున్నారు... దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? 

భువనేశ్వరి: మీరు కరెక్టుగా చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబును బయట లేకుండా చేయాలని చూస్తున్నారు. భవిష్యత్ గ్యారంటీ, యువగళం పాదయాత్ర సక్సెస్ అయ్యాయి. దీంతో భయపడి చంద్రబాబును లోపల వేశారు. లోకేశ్ మళ్లీ పాదయాత్ర చేస్తారు. ఎన్నికలొస్తున్నాయి. ఓటు చాలా విలువైంది. మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించి ఓటేయాలి. 

సుధ: మీ తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు సీఎంగా, మీ కుమారుడు లోకేశ్ మంత్రిగా చేశారు. ఇంత గొప్పస్థాయిని చూసిన మీరు ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటారు? 

భువనేశ్వరి: మా తండ్రి పౌరుషం నాలో ఉంది. చంద్రబాబుతో పెళ్లయ్యాక క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నా. ఇవే నన్ను ముందుకు తీసుకెళతాయి. 

ప్రవీణ, తిరుపతి: జగన్ అరెస్టు అయినప్పుడు ఇంట్లో నలుగురు తప్ప ఎవరూ న్యాయం అడగలేదు. కానీ చంద్రబాబు అరెస్టు అయ్యాక, తెలుగు ప్రజలు, ఉద్యోగులు న్యాయం కావాలిని అడుగుతున్నారు. దీనిపై మీరేమంటారు.?

భువనేశ్వరి: చంద్రబాబు కష్టం వారు మర్చిపోలేదు. చంద్రబాబు వారి ఇంట్లో వెలుగులు నింపారు. అలాంటి మనిషిని ఎవరూ మర్చిపోలేదు... ఇప్పుడూ ఆయనను నమ్ముతున్నారు. అందుకే మహిళలు న్యాయం కోసం ముందుకు వచ్చి పోరాడుతున్నారు. ఏనాడూ రాని మహిళలు బయటకు వచ్చి పోరాడుతుంటే పోలీసులు ఇబ్బందులు పెడతున్నారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే నీరు ఎలా ఇవ్వాలో ఆలోచించకుండా, చంద్రబాబు లేఖపై విచారణ అంటూ పనిలేని ఆలోచనలు చేస్తున్నారు. 

సులోచన, తిరుపతి: మీరు ఈ జిల్లాకు కోడలు అయ్యి 40 ఏళ్లు అయింది. మిమ్మల్ని మేము ఎప్పుడూ ఒంటరిగా చూళ్లేదు. తిరుపతి, నారావారిపల్లెకు ఒంటరిగా వెళ్లారు. దీన్ని మీరు ఎలా భావిస్తారు? 

భువనేశ్వరి: జీవితంలో ఇబ్బందులు అందరికీ వస్తాయి. ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుంది. ఈ ధైర్యంతో అంతా కలిసి ఉన్నాం. 

భువన, లా స్టూడెంట్: ఎంపీ హత్య చేస్తే ఆధారాలున్నా అరెస్టు చేయలేదు. కానీ చంద్రబాబుపై ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు? 

భువనేశ్వరి: ఆలస్యం అయినా ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరు. 

హరిప్రసాద్, జనసేన: ధర్మాన్ని కటకటాల వెనక్కు నెట్టారు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక లక్ష్మణుడిలా కదిలి వచ్చారు. పవన్ మిమ్మల్ని కలవడం మీకు ఎలా అనిపించింది?

భువనేశ్వరి: నన్ను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు "బాగున్నారా అమ్మా" అని ఆప్యాయంగా అడిగారు. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల గురించి చెప్పి బాధపడ్డారు. మాలాగే రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. మన రెండు పార్టీలు కలసి ముందుకు వెళతాయని ఆశిస్తున్నా.

More Telugu News