Ghostbusters: హైదరాబాద్ కుందన్‌బాగ్‌లో ‘ఘోస్ట్‌బస్టర్స్’.. రాత్రయితే భయంభయం.. దెయ్యాలను చూపించేందుకు పోటాపోటీ.. మిలియన్లు దాటుతున్న వ్యూస్!

  • ప్రశాంతంగా ఉండే కుందన్‌బాగ్‌లో కలకలం
  • బూత్‌బంగ్లా వద్దకు బారులు తీరుతున్న యువకులు
  • రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు షూటింగ్
  • ఇంట్లోకి వెళ్లి భయంతో అరుస్తూ బయటకు పరుగులు
  • నిద్రకు దూరమవుతున్న స్థానికులు
  • 35 మంది యువకుల అరెస్ట్
Ghostbusters in Hyderabads Kundanbagh Police arrested 35 youth

చాలా వరకు ఇలాంటి సీన్లు సినిమాల్లోనే కనిపిస్తాయి. కొన్ని చోట్ల అరుదుగానూ చూస్తుంటాం. ఇప్పుడు హైదరాబాద్ బేగంపేట సమీపంలోని కుందన్‌బాగ్ కాలనీలో ఇది నిత్యకృత్యమైంది. రాత్రయితే చాలు ప్రశాంతంగా ఉండే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. దాదాపు 30-40 మంది యువకులు ద్విచక్ర వాహనాలపై ఆ ప్రాంతమంతా తిరుగుతూ పహారా కాస్తున్నారు. దీంతో రణగొణ ధ్వనులతో ఆ ప్రాంతం మోతెక్కిపోతోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోందనేగా మీ అనుమానం.. అక్కడున్న ఓ భూత్‌బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని భావిస్తున్న యువకులు ఆ రహస్యాన్ని ఛేదించేందుకే ఇదంతా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు, రీల్స్ అయితే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. 

పూర్తిగా పాడుబడిన ఈ ఇంటి వద్దకు ఎలా చేరుకోవాలో కూడా చెబుతూ గూగుల్‌ మ్యాప్‌ లోకేషన్ కూడా షేర్ చేస్తున్నారు. అయితే, ఇదంతా బూటకమని, వ్యూస్, లైకుల కోసం అల్లుకున్న ఫేక్ స్టోరీ అని ఇరుగుపొరుగువారు కొట్టిపడేస్తున్నారు. ఈ గోల వల్ల తాను వారం రోజులుగా నిద్రకు దూరమైనట్టు మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ లేట్‌నైట్ మేనియా ఆయన ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. అందులో కొందరు బైక్‌లపైనా, మరికొందరు కాలినడకనా ఆ ఇంటి (బూత్ బంగ్లా) వరకు వెళ్లడం కనిపిస్తోంది. అంతేకాదు, ఇంట్లోకి వెళ్లాక భయంతో అరుస్తూ బయటకు పరిగెత్తడం కూడా అందులో ఉంది. ఇదంతా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జరుగుతోంది. 

వీరి గొడవతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గత మూడు రోజుల్లో 35 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. భూతాల కొంపగా భావిస్తున్న ఆ ఇంటి గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఆ ఇంటిపై వస్తున్న రూమర్లను కొట్టిపడేశారు. ఆ ఇంటివద్ద కొందరు పోలీసులను మోహరించామని, గత మూడు రోజుల్లో 35 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై కేసులు నమోదుచేశామని, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి  పంపామని పంజగుట్ట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మోహన్ కుమార్ తెలిపారు. మరికొన్ని రోజులపాటు ఆ ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉంటారని, ఎవరైనా అటువస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. 

కుందన్‌బాగ్‌లోని ఈ ఇల్లు ఒక్కసారిగా వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. 2014లోనూ ఈ ఇంటి చుట్టూ చాలా కథలు ప్రచారమయ్యాయి. అప్పుడు కూడా ఇలాగే జరిగినా.. అప్పట్లో సోషల్ మీడియా ప్రచారం ఇంతలా లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే అది తెరమరుగైంది. ఇప్పుడు మాత్రం అది మరింత విచ్చలవిడిగా మారి స్థానికులను నిద్రకు దూరం చేస్తోంది.

More Telugu News