Chiranjeevi: బాల్య స్నేహితుడికి మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేసిన చిరంజీవి

  • పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి
  • అనారోగ్యం బారినపడిన చిరంజీవి బాల్య మిత్రుడు పువ్వాడ రాజా
  • రాజా స్వస్థలం మొగల్తూరు
  • చిన్ననాటి ఫ్రెండ్ కు అండగా నిలిచిన మెగాస్టార్
  • అపోలో ఆసుపత్రిలో రాజాను పరామర్శించిన చిరంజీవి
Chiranjeevi helps his childhood friend

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటనలోనే కాదు... సామాజిక సేవా కార్యక్రమాలు, అవసరంలో ఉన్నవారికి సాయం అందించడంలోనూ మెగాస్టారే. ఆ విషయం గతంలో చాలాసార్లు నిరూపణ అయింది. చిరంజీవి చేసే సహాయాల్లో కొన్ని బయటికి రావు. ఆయన ఇలాంటి విషయాలను తనంత తానుగా ఎప్పుడూ చెప్పుకోరు. 

తాజాగా, ఓ బాల్య స్నేహితుడికి మెరుగైన వైద్యం అందేలా చిరంజీవి ఏర్పాట్లు చేసిన వైనం కూడా ఓ వ్యక్తి ట్వీట్ చేస్తేనే అందరికీ తెలిసింది. చిరంజీవి సొంతూరు మొగల్తూరు అని తెలిసిందే. మొగల్తూరులో ఆయనకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు. అలాంటి వారిలో పువ్వాడ రాజా ఒకరు. 

పువ్వాడ రాజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి బాల్య మిత్రుడికి అండగా నిలిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో రాజాకు మెరుగైన వైద్య చికిత్స అందేలా తన పలుకుబడి ఉపయోగించారు. అపోలో ఆసుపత్రికి వెళ్లి అక్కడి వైద్యులతో మాట్లాడి, రాజా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 

ఉజ్వల్ రెడ్డి అనే వ్యక్తి ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు, చిరంజీవి అపోలో ఆసుపత్రికి వచ్చి పువ్వాడ రాజాను పరామర్శించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

More Telugu News