Anand Mahindra: నా ఐఫోన్ మేడిన్ ఇండియా అనగానే అతడు ఆశ్చర్యపోయాడు: ఆనంద్ మహీంద్రా

  • ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం
  • తనది మేడిన్ ఇండియా ఐఫోన్ అని చెబితే వెరిజాన్ స్టోర్ సేల్స్‌పర్సన్ ఆశ్చర్యపోయాడని వెల్లడి
  • త్వరలో మేడిన్ ఇండియా పిక్సెల్ ఫోను కూడా తీసుకుంటానన్న ఆనంద్ మహీంద్రా
  • అప్పటికి భారత్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తన స్థానం సుస్థిరం చేసుకుంటుందని వెల్లడి
Pleasure to see his raised eyebrows says Anand Mahindra

భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా నిలిపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వీటికి భౌగోళిక రాజకీయ మార్పులు కూడా తోడవడంతో ప్రపంచ కార్పొరేట్ సంస్థలు భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే యాపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్-15 తయారీని ప్రారంభించింది. గూగుల్ కూడా పిక్సెల్‌ ఫోన్‌ను భారత్‌లోనే తయారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా తనకు అమెరికాలో ఎదురైన అనుభవాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘లోకల్ సిమ్ కోసం నేను ఇటీవలే అమెరికాలోని ఓ వెరిజాన్ స్టోర్‌కు వెళ్లాను. అక్కడున్న సేల్స్ పర్సన్‌కు నా ఐఫోన్-15 చూపించి ఇది మేడ్-ఇన్-ఇండియా అని చెప్పాను. అది విని అతడు ఆశ్చర్యపోయాడు. అతడి ఆశ్చర్యం చూసి నాకు భలే ఆనందంగా అనిపించింది. నా దగ్గర గూగుల్ పిక్సెల్ ఫోన్ కూడా ఉంది. మేడ్-ఇన్-ఇండియా ‘పిక్సెల్’ విడుదలయ్యాక దాన్నీ తీసుకుంటా. అప్పటికి భారత్ ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా మారుతుందని కాబట్టి నాది మేడ్-ఇన్- ఇండియా అని చెప్పినా ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోకపోవచ్చు’’ అని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. త్వరలో గూగుల్ భారత్‌లో పిక్సెల్ ఫోన్ల తయారీ మొదలుపెట్టనుందన్న వార్తను ఆయన నెట్టింట షేర్ చేస్తూ ఈ కామెంట్ చేశారు. 2024 నాటికల్లా తొలి మేడిన్ ఇండియా పిక్సెల్ ఫోన్ మార్కెట్లో విడుదల అవుతుందని సమాచారం.

More Telugu News