కేసీఆర్‌పై బండి సంజయ్, విజయశాంతి పోటీ?.. రాములమ్మ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశ్యం కాకపోయినప్పటికీ పార్టీ ఆదేశిస్తే అందుకు సిద్ధమని ఆమె చెప్పారు. ఆమె మొదటి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీపై దృష్టి పెడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తనను కామారెడ్డి, బండి సంజయ్‌ని గజ్వేల్ నుంచి పోటీ చేయమని కార్యకర్తలు అడుగుతున్నారని, అందులో సమస్య ఏమీ లేదన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్‌పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని కార్యకర్తల విశ్వాసమని, అందుకే గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తనను అసెంబ్లీకి కేసీఆర్‌పై పోటీ చెయ్యాలని కార్యకర్తలు అడగటం తప్పేమీ కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తన ఉద్దేశ్యం కానప్పటికీ, వ్యూహాత్మక నిర్ణయాల కోసం పార్టీ నిర్దేశిస్తే పోటీకి సిద్ధమన్నారు. చివరలో హరహర మహాదేవ, విజయశాంతి అంటూ ట్వీట్ ముగించారు.


More Telugu News