BJP MP: అందుకనే మీరు చస్తే బిల్‌కుల్‌ డబ్బులు ఇస్తా అన్నా: అరవింద్‌

  • రైతులు చస్తే రూ.5లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఏంటన్న అరవింద్
  • కరోనాతో ఆసుపత్రుల్లో లక్షలు కడుతుంటే ఆరోగ్య శ్రీ ఇచ్చారా అంటూ ప్రశ్న
  • పంటలు నష్టపోతే పరిహారం చెల్లించారా? అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ
If KCR KTR and daughter Kavitha die I will pay compensation BJP MP arvind targets

బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు బీమా ఇస్తామంటూ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొనడం పట్ల అరవింద్ వ్యంగ్యంగా స్పందించారు. ఎన్నికల ర్యాలీ సందర్భంగా అరవింద్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ చనిపోతే రూ.5 లక్షలు, కేటీఆర్ చనిపోతే రూ.10 లక్షలు, కవిత చనిపోతే రూ.20 లక్షలు ఇస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై కవిత మండిపడ్డారు. ‘‘ఇదేం సంస్కారం అరవింద్! మీలాంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన టైమ్ వచ్చేసింది’’ అని అన్నారు. 


దీనిపై అరవింద్ తిరిగి స్పందించారు. ‘‘సీఎం కేసీఆర్ కూతురు అయిన మన ఎమ్మెల్సీ ఎన్నడూ ఏ పాపం చేయలే.. రూపాయి కూడా తినలేదు. తెలంగాణను ముంచలేదు" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా..? మీకేమైనా కళ్లు బైర్లు కమ్మాయా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టడం ఏంటని నిలదీశారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి బారిన పడి ఆసుపత్రి పాలై, బాధితులు లక్షలాది రూపాయలు కడుతున్నా.. ఆరోగ్య శ్రీ ఇచ్చారా? కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ఇచ్చారా? పంటలు నష్టపోతుంటే పరిహారం చెల్లించారా? అని అరవింద్ ప్రశ్నించారు. ఇవన్నీ చేయకుండా రైతు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామనడం ఏంటని నిలదీశారు. ఇవన్నీ మీ దొరబద్ధులకు నిదర్శమని మండిపడ్డారు. అందుకనే మీరు చస్తే బిల్ కుల్ డబ్బులు ఇస్తానని అన్నట్టుగా వివరణ ఇచ్చారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పెడితే, బీజేపీ కూడా ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పెడుతుందన్నారు. 

తాను తెలంగాణ ఆడబిడ్డనని కవిత పేర్కొనడం పట్ల కూడా అరవింద్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఆడబిడ్డలు ఇలానే చేస్తారా? అని నిలదీశారు. తాను ఇంట్లో లేనప్పుడు, తన అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు తన ఇంటికి రౌడీ మూకలను పంపించి దాడి చేయించడాన్ని అరవింద్ ప్రశ్నించారు. అప్పుడు ఏమైంది నీ ఆడుపడుచుదనమంటూ కవితకు కౌంటర్ ఇచ్చారు.

More Telugu News