Hamas: బందీల సోషల్ మీడియా ఖాతాల్లో లైవ్ స్ట్రీమింగ్.. హమాస్ కొత్త ఎత్తుగడ

  • జనాలను భయబ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా మిలిటెంట్ల చర్యలు
  • వీడియో సందేశాల ద్వారా బందీల బంధువులకు హెచ్చరికలు
  • లైవ్ స్ట్రీమింగ్ చూసి భయపడినట్లు బందీల స్నేహితుల వెల్లడి
Hamas has seized the social media accounts of kidnapped Israelis

ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేసి పలువురిని ఎత్తుకెళ్లిన హమాస్ మిలిటెంట్లు బందీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. బందీల ఫేస్ బుక్ ఖాతాలలో పోస్టులు పెడుతూ, లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. రాకెట్ దాడులను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారని బందీల బంధువులు చెబుతున్నారు. అందులో హింసాత్మక సందేశాలను పోస్ట్ చేస్తున్నారని, తమ ఆకృత్యాలను ప్రపంచానికి చూపేందుకు వాటిని వేదికగా వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

గాజా సరిహద్దుల్లోని కిబ్బుట్జ్ లో ఉండే గాలి ష్లెంజింగర్ ఇదాన్ ఫేస్ బుక్ ఖాతాలో ఇలాంటి హింసాత్మక వీడియోలను చూసినట్లు ఆమె బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. ఈ నెల 7న జరిగిన సూపర్ నోవా ఫెస్టివల్ తర్వాత ఇదాన్ కుటుంబం కనిపించకుండా పోయింది. వారిని హమాస్ మిలిటెంట్లు ఎత్తుకెళ్లినట్లు ఆ తర్వాత తెలిసిందని వివరించారు. అయితే, అదేరోజు ఇదాన్ ఫేస్ బుక్ ఖాతాలో లైవ్ స్ట్రీమింగ్ ప్రత్యక్షమైందని ఇదాన్ పొరిగింట్లో ఉండే మహిళ ఒకరు చెప్పారు. సాదారణంగా ఇదాన్ లైవ్ స్ట్రీమింగ్ లాంటివి చేయదని.. అలాంటి వ్యక్తి లైవ్ పెట్టడంతో తాను వెంటనే ఓపెన్ చేశానని తెలిపారు.

అందులో.. ఇదాన్ ఆమె భర్త, కొడుకు మాత్రమే కనిపించారని, ముసుగులు ధరించిన వ్యక్తులు ఒకరిద్దరు కూడా వారి ఇంట్లో తిరగడం కనిపించిందని పేర్కొన్నారు. తన అక్కలు ఎక్కడున్నారని ఇదాన్ కొడుకు అడగడం వినిపించిందన్నారు. ఇదాన్ పెద్ద కూతురును వాళ్లింట్లోనే చంపేసి, మిగతా కుటుంబాన్ని హమాస్ మిలిటెంట్లు గాజాకు తీసుకెళ్లినట్లు తర్వాతి రోజు తమకు తెలిసిందని వివరించారు.

 కాగా, విచక్షణారహితంగా కాల్పులు జరపడం, రాకెట్ బాంబులతో దాడులు చేయడమే తెలిసిన మిలిటెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కొత్త యుద్ధతంత్రాన్ని అవలంబిస్తున్నట్లు అర్థమవుతోందని ఇజ్రాయెల్ యుద్ధ నిపుణులు చెబుతున్నారు. బందీల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి, వాటిలో వీడియోలు, హింసాత్మక సందేశాలను పోస్ట్ చేయడం ద్వారా జనాలను భయాందోళనలకు గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని వివరించారు.

More Telugu News