Sourav Ganguly: ఇలాంటి పాకిస్థాన్ టీమ్ తో మేము ఎప్పుడూ ఆడలేదు: గంగూలీ సంచలన వ్యాఖ్యలు

  • అహ్మదాబాద్ మ్యాచ్ లో ఇండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్ జట్టు
  • తాము ఆడే రోజుల్లో పాక్ జట్టు చాలా బలంగా ఉండేదని కితాబు
  • బాబర్, రిజ్వాన్ బ్యాటింగ్ లో కూడా కసి కనిపించలేదని విమర్శ

వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఈ నెల 14న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. వన్ సైడెడ్ గా సాగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో పాక్ జట్టు పూర్తిగా విఫలమయింది. మరోవైపు దాయాదుల మధ్య రసవత్తరమైన హై ఓల్టేజ్ మ్యాచ్ వీక్షించాలని స్టేడియంకు వచ్చిన వారంతా... లో ఓల్టేజ్ మ్యాచ్ ని చూసి పూర్తిగా నిరాశ చెందారు, ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

పాకిస్థాన్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ... తాము ఆడే రోజుల్లో పాకిస్థాన్ టీమ్ ఇలా ఉండేది కాదని చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ తో పాటు పటిష్ఠమైన బ్యాటింగ్ ఆర్డర్ తో పాక్ జట్టు చాలా బలంగా ఉండేదని అన్నారు. ఇప్పుడున్నటువంటి పాక్ జట్టుతో తాము ఏరోజూ ఆడలేదని చెప్పారు. ప్రస్తుత పాక్ జట్టు పేపర్ మీద మాత్రమే పటిష్ఠంగా కనిపిస్తోందని అన్నారు. పాక్ బ్యాట్స్ మెన్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఇలాంటి జట్టుతో వరల్డ్ కప్ లో పాక్ నెట్టుకు రావడం కష్టమేనని అన్నారు. పాక్ స్టార్ బ్యాట్స్ మెన్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ల బ్యాటింగ్ లో కూడా తనకు కసి కనిపించలేదని... టెక్నిక్ తెలియనట్టు, భయపడుతూ ఆడుతున్నట్టే అనిపించిందని చెప్పారు.

More Telugu News