Chhattisgarh: భార్యకు తెలీకుండా ఆమె కాల్స్ రికార్డు చేసిన భర్త.. హైకోర్టు తీర్పు ఇదే!

  • భర్త నుంచి మెయింటెనెన్స్ కోరుతూ భార్య పిటిషన్
  • భార్యకు అక్రమసంబంధం ఉన్నందున ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని భర్త వాదన
  • ఇది రుజువు చేసేందుకు ఆమె కాల్ రికార్డ్స్ ఆధారంగా రీఎగ్జామినింగ్‌కు అనుమతి కోరిన వైనం
  • మహిళకు తెలీకుండా ఆమె కాల్ రికార్డ్ చేసి వ్యక్తిగత గోప్యత హక్కును భర్త ఉల్లంఘించాడన్న హైకోర్టు
  • అతడికి అనుకూలంగా కిందికోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ ఆదేశాలు
Man Recorded Wifes Phone Calls Without Permission What Court Said

ఓ వ్యక్తికి తెలీకుండా వారి కాల్స్ రికార్డ్ చేయడం ఆర్టికల్ 21 ఇచ్చిన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని చత్తీస్‌ఘడ్‌ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. భార్య కాల్ రికార్డింగ్స్ ఆధారంగా ఆమెను రీఎగ్జామిన్ చేసేందుకు భర్తకు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.  

భర్త నుంచి మెయింటెనెన్స్ కోరుతూ ఓ మహిళ(38) 2019లో మహాసముండ్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయమై భార్యను రీఎగ్జామిన్ చేయాలని కోరుతూ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య ఫోన్ కాల్ రికార్డ్స్‌లో ఆమె వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వివాహేతర సంబంధం కారణాన ఆమెకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇందుకు అనుమతిస్తూ ఫ్యామిలీ కోర్టు 2021 అక్టోబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. 

దీన్ని సవాలు చేస్తూ మహిళ తరపు న్యాయవాది 2022లో చత్తీస్‌ఘడ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించారు. భార్యకు తెలీకుండా భర్త ఆమె ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, దీని ఆధారంగా రీఎగ్జామినింగ్‌కు అనుమతించలేమని స్పష్టం చేశారు. ఈ విషయమై గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించారు. 

ఈ క్రమంలో మహిళ తరపు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది. కింది కోర్టు ఆదేశాలను పక్కనబెడుతూ తీర్పు వెలువరించింది.

More Telugu News