Team India: ఫర్వాలేదనిపించిన ఆఫ్ఘనిస్థాన్... టీమిండియా టార్గెట్ ఎంతంటే...!

  • వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా
  • బుమ్రాకు 4 వికెట్లు
Team India restricts Afghanistan for 272 runs

ఆఫ్ఘనిస్థాన్ చిన్న జట్టే కదా... తక్కువ స్కోరుకు చుట్టేయొచ్చని టీమిండియా వ్యూహకర్తలు భావించి ఉంటారు! కానీ వాస్తవానికి జరిగింది వేరు. వరల్డ్ కప్ లో ఇవాళ ఢిల్లీలో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. 

కెప్టెన్ హష్మదుల్లా షాహిది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘన్ జట్టు 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా... షాహిది, అజ్మతుల్లాతో కలిసి విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. షాహిది 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 89 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అజ్మతుల్లా 69 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. 

లోయరార్డర్ లో నబీ 19, రషీద్ ఖాన్ 16, ముజీబ్ 10 పరుగులు చేశారు. అంతకుముందు, ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 21, ఇబ్రహీం జాద్రాన్ 22 పరుగులు చేశారు. చివర్లో టీమిండియా పేసర్ బుమ్రా కాస్త కట్టడి చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆఫ్ఘన్ జోరుకు కళ్లెం వేశాడు. బుమ్రాకు మొత్తం 4 వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా 2, శార్దూల్ ఠాకూర్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. 

సిరాజ్, జడేజాలకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. జడేజా పెద్దగా పరుగులు ఇవ్వకపోయినా, సిరాజ్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 

అనంతరం 273 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ (31 బ్యాటింగ్), ఇషాన్ కిషన్ (5 బ్యాటింగ్) ఆడుతున్నారు.

More Telugu News