Uttar Pradesh: ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి.. సన్నిహితంగా ఉండగా చూశారని చెల్లెళ్ల హత్య

  • ఉత్తరప్రదేశ్‌లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి
  • చెల్లెళ్లను ఎవరో చంపేశారని నమ్మించే యత్నం
  • దుస్తులపై రక్తపు మరకలతో దొరికిపోయిన నిందితురాలు
Girl killed her sisters as they saw her with boy friend

తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుందో యువతి. వారిద్దరూ సన్నిహితంగా ఉండడం చెల్లెళ్లు చూశారు. ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు ఎక్కడ చెప్పేస్తారోనన్న భయంతో వారిని దారుణంగా హతమార్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన అంజలి (20) కొన్నాళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది.

ఇటీవల తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ప్రియుడ్ని నేరుగా ఇంటికి పిలిపించుకుంది. అతడితో సన్నిహితంగా ఉండగా ఆమె ఆరు, నాలుగు సంవత్సరాల వయసున్న చెల్లెళ్లు చూశారు. దీంతో ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులు చెప్పేస్తారేమోనన్న భయంతో వారిద్దరినీ పదునైన ఆయుధంతో హతమార్చింది.

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లెళ్లను ఎవరో చంపేశారని చెప్పి వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అంజలి దుస్తులపై రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించి ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో ఆమెకు మరికొందరు సహకరించినట్టు అనుమానిస్తున్న పోలీసులు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News