Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నేడే.. ప్రకటించనున్న ఈసీ

  • నేటి మధ్యాహ్నం ఎన్నికల తేదీల ప్రకటన
  • మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో నేరుగా తలపడనున్న బీజేపీ-కాంగ్రెస్
  • తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు పోటీ
EC To Announce Dates For Assembly Election In 5 States Today

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ నేడు ప్రకటించనుంది. మధ్యాహ్నం మీడియా సమావేశంలో తేదీలను ప్రకటిస్తూ.. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలపైనా వివరించనుంది.
 
2018లో పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లోని నాలుగింటిలో ఎన్నికలు ఒకే దశలో జరిగాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో జరిగాయి. షెడ్యూల్ ప్రకటన తర్వాత ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి రాజుకోనుంది. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్-బీజేపీ నేరుగా తలపడనున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ అధికారంలోకి రావడమే పరమావధిగా పావులు కదుపుతోంది. 

మరోవైపు, కేంద్రంలో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 25 పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే, ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాదు, ఇందులోని పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి.

More Telugu News