Daggubati Purandeswari: మద్యం సొమ్ము వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోంది... సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాను కోరిన పురందేశ్వరి

  • ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పురందేశ్వరి
  • ఏపీలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడి
  • క్యాష్ అండ్ క్యారీ విధానంతో భారీ అవినీతి చోటుచేసుకుంటోందని వ్యాఖ్యలు
  • అమిత్ షాకు వినతిపత్రం సమర్పణ
Purandeswari met Amit Shah in Delhi

ఏపీలో గత నాలుగున్నరేళ్లుగా మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. పురందేశ్వరి ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఏపీలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వినతిపత్రం సమర్పించారు. 

రాష్ట్రంలో మద్యం విక్రయాల సొమ్ము భారీ మొత్తంలో అనధికారికంగా వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోందని పురందేశ్వరి ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ఓ లిక్కర్ షాపులో విక్రయాలను పరిశీలిస్తే... రూ.1 లక్ష వరకు అమ్మకాలు జరగ్గా, రూ.700కి మాత్రమే డిజిటల్ చెల్లింపులు జరిగినట్టు వెల్లడైందని తెలిపారు. 

క్యాష్ అండ్ క్యారీ విధానంతో ఏపీ లిక్కర్ విధానంలో భారీ అవినీతి జరుగుతోందని, ప్రధానంగా చీప్ లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటూ ఉచితాలు ఇస్తున్నామని చెప్పుకోవడం హేయమని అన్నారు.

More Telugu News