Hamas: హమాస్ కు మద్దతు ప్రకటించిన హిజ్బుల్లా... ఇజ్రాయెల్ లో 600కి పెరిగిన మృతుల సంఖ్య!

  • ఇజ్రాయెల్ పై హమాస్ భీకర దాడులు
  • అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య
  • ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదించిన హమాస్ రాకెట్లు!
  • మా తుపాకులు, మా రాకెట్లు ఇక మీతోనే అంటూ హమాస్ కు హిజ్బుల్లా సంఘీభావం
Lebanon militant group Hezbollah supports Hamas against Israel

ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం నేటికి రెండో రోజుకు చేరుకుంది. నిన్న హమాస్ ఇస్లామిక్ గ్రూప్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపై పెద్ద ఎత్తున రాకెట్ దాడులు చేపట్టడం తెలిసిందే. హమాస్ ప్రయోగించిన చాలా రాకెట్లు ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదించుకుని ఇజ్రాయెల్ భూభాగంపై విధ్వంసం సృష్టించాయి. 

దానికితోడు హమాస్ మిలిటెంట్లు పారాగ్లైడర్ల సాయంతో ఇజ్రాయెల్ గడ్డపై దిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. చాలామంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. హమాస్ మారణకాండలో మృతి చెందిన వారి సంఖ్య 600కి పెరిగినట్టు ఇజ్రాయెల్ మీడియా సంస్థలను ఉటంకిస్తూ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. 

తాజాగా, ఈ సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ కు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా బహిరంగంగా మద్దతు ప్రకటించింది. "మా చరిత్ర, మా తుపాకులు, మా రాకెట్లు... మాకు సంబంధించిన ప్రతిదీ ఇక మీతోనే" అంటూ హిజ్బులా సీనియర్ ప్రముఖుడు హషీమ్ సఫిద్దీన్ పేర్కొన్నారు. పాలస్తీనా యోధులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News