Shivraj Singh Chouhan: నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా?: ప్రజలను అడిగిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్

  • దిండోరీలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ప్రజల్ని ప్రశ్నలడిగిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
  • మంచి ప్రభుత్వాన్నే నడిపిస్తున్నానా? మోదీ పాలన మళ్లీ కోరుకుంటున్నారా? అని ప్రశ్న
  • కేంద్ర, రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించాలని భావిస్తున్నారా? అని అడిగిన సీఎం
  • సానుకూలంగా స్పందించిన ప్రజలు
Shivraj Singh Chouhan asks should he become Chief Minister or not at poll rally

నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా? అంటూ మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. మీరు మరోసారి సీఎం అవడం ఖాయమని సభకు హాజరైనవారు ముక్తకంఠంతో నినదించారు. ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అక్కడ రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిండోరిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. తాను మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నానా, లేదా? ఈ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందా? లేదా? నేను మరోసారి ముఖ్యమంత్రిని అవుతానా? అని ప్రశ్నించారు.

అలాగే, కేంద్ర, రాష్ట్రాలలో బీజేపీనే విజయం సాధించాలని భావిస్తున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నలు సంధించారు. ఆయన ప్రశ్నలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము పోటీ చేసేందుకు ప్రజల అనుమతి తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు కొన్ని సమావేశాల్లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం బుధ్నిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, నన్ను మళ్లీ పోటీ చేయమంటారా? అని ప్రశ్నించారు.

More Telugu News